పెన్నహోబిలం బ్రహ్మోత్సవాలు ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

పెన్నహోబిలం బ్రహ్మోత్సవాలు ప్రారంభం

May 10 2025 8:02 AM | Updated on May 10 2025 8:02 AM

పెన్న

పెన్నహోబిలం బ్రహ్మోత్సవాలు ప్రారంభం

ఉరవకొండ రూరల్‌: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెన్నహోబిలం లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈఓ సాకే రమేష్‌బాబు, ప్రధాన అర్చకులు ద్వారకనాథాచార్యులు, బాలాజీస్వామిల ఆధ్వర్యంలో మేళతాళాలతో పెన్నహోబిలం నుంచి ఊరేగింపుగా ఆమిద్యాలకు వెళ్లారు. అక్కడి పెన్నోబులేసుని ఆలయంలో ఉత్సవమూర్తులకు విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేక పల్లకీలో శ్రీవారి ఉత్సవ మూర్తులను ఊరేగింపుగా పెన్నహోబిలానికి తీసుకొచ్చారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి ఆలయంలో కొలువుదీర్చారు.

ముగిసిన గ్రూప్‌–1 మెయిన్స్‌

అనంతపురం అర్బన్‌: ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్‌సీ) ఆధ్వర్యంలో ఈ నెల 3న ప్రారంభమైన గ్రూప్‌–1 మెయిన్స్‌ పరీక్షలు శుక్రవారంతో ముగిశాయి. ఏడు రోజుల పాటు జరిగిన పరీక్షల్లో అభ్యర్థుల హాజరు 64.28 శాతం నమోదయ్యింది. అనంతపురంలోని పీవీకేకే ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, శ్రీ బాలాజీ పీజీ కళాశాలలో పరీక్షలు నిర్వహించారు. పీవీకేకే కళాశాలలో 234 మంది, శ్రీ బాలాజీ కళాశాలలో 360 మంది.. మొత్తం 594 మంది అభ్యర్థులకు గాను 381 మంది హాజరయ్యారు. పరీక్షల తీరును కలెక్టర్‌ వినోద్‌కుమార్‌, జాయింట్‌ కలెక్టర్‌ శివ్‌ నారాయణ్‌ శర్మ, అసిస్టెంట్‌ కలెక్టర్‌ సచిన్‌ రహర్‌ పరిశీలించారు. పరీక్షలకు లైజన్‌ అధికారులుగా డిప్యూటీ కలెక్టర్లు తిప్పేనాయక్‌, మల్లికార్జునుడు వ్యవహరించారు.

‘పరివాహన్‌’లోనే

ట్రాలీల రిజిస్ట్రేషన్‌

అనంతపురం సెంట్రల్‌: ట్రాక్టర్‌ ట్రాలీల రిజిస్ట్రేషన్లు ఇక నుంచి ‘పరివాహన్‌’ వైబ్‌సైట్‌లోనే జరుగుతాయని ఉప రవాణా కమిషనర్‌ (డీటీసీ) ఎం.వీర్రాజు తెలిపారు. ఇప్పటి వరకూ ఈ–ప్రగతి సైట్‌లో రిజిస్ట్రేషన్‌లు జరిగేవని, కొద్దిరోజులుగా ఇందులో రిజిస్ట్రేషన్లు నిలుపుదల చేశామని పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో రవాణాశాఖలో ప్రతి సేవా ఆన్‌లైన్‌లోకి వెళ్లిపోయిందన్నారు. ఈ విషయాన్ని ట్రాలీల తయారీ డీలర్లు గమనించి ట్రేడ్‌ లైసెన్స్‌ కోసం ఆర్టీఏ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ట్రేడ్‌ లైసెన్స్‌ తీసుకున్న తర్వాత అందరినీ పరివాహన్‌ వెబ్‌సైట్‌లోకి మార్పు చేయనున్నట్లు తెలిపారు. ట్రాలీల రిజిస్ట్రేషన్‌లు పకడ్బందీగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు.

మురళీనాయక్‌ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి

అనంతపురం కార్పొరేషన్‌: ఆపరేషన్‌ సిందూర్‌లో పాలుపంచుకుని పాక్‌ సైనికుల కాల్పుల్లో అసువులు బాసిన గోరంట్ల మండలానికి చెందిన మురళీనాయక్‌ కుటుంబానికి మాజీ మంత్రి, శింగనమల నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త డాక్టర్‌ సాకే శైలజానాథ్‌ ప్రగాఢ సానుభూతి తెలిపారు. మురళీనాయక్‌ మృతి ఎంతో బాధించిందన్నారు. వీర జవాన్‌ ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.

యుద్ధానికి సిద్ధమైన

మాజీ సైనికులు

అనంతపురం: అవసరమైతే యుద్ధానికి తాము కూడా సిద్ధమంటూ జిల్లా మాజీ సైనికులు తెలిపారు. యుద్ధంలో అమరుడైన మురళీనాయక్‌ చిత్రపటానికి అనంతపురం జిల్లా మాజీ సైనికుల సంఘం అధ్యక్షుడు కెప్టెన్‌ షేకన్న ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. వీరజవాన్‌ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. అనంతరం ఆర్ట్స్‌ కళాశాల నుంచి టవర్‌క్లాక్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సంఘం ట్రెజరర్‌ తిమ్మారెడ్డి, కరణంకృష్ణ, బి.రవికుమార్‌, మహమ్మద్‌ గౌస్‌, బీఏ హుస్సేన్‌, సుహెల్‌, రాజగోపాల్‌, వెంకటరమణ, ఏవీ రమణ, ఐ.శ్రీనివాసులు, బాలస్వామి, తదితరులు పాల్గొన్నారు.

పెన్నహోబిలం బ్రహ్మోత్సవాలు ప్రారంభం 1
1/2

పెన్నహోబిలం బ్రహ్మోత్సవాలు ప్రారంభం

పెన్నహోబిలం బ్రహ్మోత్సవాలు ప్రారంభం 2
2/2

పెన్నహోబిలం బ్రహ్మోత్సవాలు ప్రారంభం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement