
ముంచుకొస్తున్న గడువు
అనంతపురం అర్బన్: సంక్షేమానికి కోతపెట్టేందుకు కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న మార్గాలు పేదల పాలిట శాపంగా మారాయి. తాజాగా బియ్యం పంపిణీలో కోత పెట్టేందుకు ఈ–కేవైసీ పేరుతో మెలిక పెట్టింది. ఈనెల 30 వ తేదీలోగా రేషన్ కార్డులోని సభ్యులు ఈ–కేవైసీ చేసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒక వేళ ఎవరైనా ఈ–కేవైసీ చేసుకోకపోతే మే నెలలో రేషన్ అందించబోమని అధికారులు చెబుతున్నారు. దీనిపై ఈనెల 23న గుంతకల్లు ఆర్డీఓ ఒక ప్రకటన విడుదల చేశారు. అలాగే ఈ–కేవైసీ చేసుకోని యూనిట్లను మే నెలలో తొలగిస్తామని అనంతపురం రూరల్ తహసీల్దార్ ఈనెల 17న ప్రకటన విడుదల చేశారు. ఈ–కేవైసీ నమోదు గడువు ఈనెల 30తో ముగుస్తోంది. అయితే నేటికీ జిల్లా వ్యాప్తంగా 1.32 లక్షల మంది కార్డులోని సభ్యులు ఈ–కేవైసీ నమోదు చేసుకోలేదు. దీంతో వీరందరికీ మే నెలలో బియ్యం పంపిణీ నిలిచిపోనుంది.
1.32 లక్షల మందికి బియ్యం కట్
జిల్లావ్యాప్తంగా 6,60,330 బియ్యం కార్డులు ఉండగా వీటిలో 20,11,076 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో ఈనెల 25 తేదీ వరకూ 1,32,401 మంది ఈ–కేవైసీ చేసుకోలేదు. అధికారులు ప్రకటించిన విధంగా మే నెలలో ఈ–కేవైసీ చేసుకోని వారికి రేషన్ అందదు. యూనిట్ (సభ్యుడు)కు 5 కిలోలుగా 1.32 లక్షల మందికి సంబంధించి 6.62 లక్షల కిలోలు (662 టన్నులు) బియ్యం పంపిణీ కావు. ఒకవేళ ఈ–కేవైసీ నమోదు గడువును ప్రభుత్వం పెంచితే యూనిట్లు రద్దు కాకుండా ఉంటాయి. లేదంటే మే నెలలో యూనిట్లను రద్దు చేస్తారు.
రేషన్ లబ్ధిదారులు ఈ–కేవైసీ
చేయించుకునేందుకు ఈ నెల 30 ఆఖరు
నేటికీ చేయించుకోని 1.32 లక్షల మంది
రేషన్ నిలిపివేస్తామంటున్న అధికారులు

ముంచుకొస్తున్న గడువు