నేడు కలెక్టరేట్‌లో ఫిర్యాదుల స్వీకరణ | - | Sakshi
Sakshi News home page

నేడు కలెక్టరేట్‌లో ఫిర్యాదుల స్వీకరణ

Mar 10 2025 11:01 AM | Updated on Mar 10 2025 10:55 AM

అనంతపురం అర్బన్‌: ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమాన్ని సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ వి.వినోద్‌కుమార్‌ తెలిపారు. రెవెన్యూ భవన్‌లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ కార్యక్రమం సాగుతుందన్నారు. కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు పాల్గొంటారని, ప్రజలు తమ సమస్యలను క్లుప్తంగా అర్జీ రూపంలో తెలియజేయాలని సూచించారు.

పట్టుకుంది 144..

కేసులో చూపింది 52!

పుట్లూరు: తనిఖీల్లో 144 మద్యం బాటిళ్లు పట్టుపడితే.. కేసులో కేవలం 52 మాత్రమే చూపి పోలీసులు తమ నైజాన్ని బయటపెట్టుకున్నారు. వివరాలు.. పుట్లూరు మండలం చెర్లోపల్లి – నారాయణరెడ్డిపల్లి గ్రామాల మధ్య శనివారం రాత్రి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆటోలో మూడు కేసుల్లో మొత్తం 144 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. అయితే టి.నరసింహులు అనే వ్యక్తి 52 మద్యం బాటిళ్లు తరలిస్తూ పట్టుబడినట్లు కేసు నమోదు చేసి, చేతులు దులుపుకున్నారు. ఈ విషయం బహిర్గతం కావడంతో మిగిలిన 92 మద్యం బాటిళ్లు ఎవరి కోసం దాచారో చెప్పాలని పలువురు ప్రశ్నిస్తున్నారు. అక్రమంగా కేసుల నమోదుకు ఈ బాటిళ్లను అడ్డు పెట్టనున్నారా? లేదా పోలీసులే గుట్టుగా మద్యం వ్యాపారం సాగిస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తం చేశారు.

రాయదుర్గంలో జోరుగా పావురాల పందేలు

రాయదుర్గంటౌన్‌: నియోజకవర్గ కేంద్రం రాయదుర్గంలో పావురాల పందేలు జోరుగా సాగుతున్నాయి. పావురాలను గాల్లోకి ఎగరవేసి వాటిలో ఏది ముందుగా గమ్యాన్ని చేరితే దానిని విజేతగా ప్రకటిస్తారు. ఈ క్రమంలో రూ. లక్షల్లో బెట్టింగ్‌ సాగుతోంది. ఆదివారం పావురాలను ఎగుర వేసి వాటి రాక కోసం పట్టణ శివారులోని పైతోట వద్ద జాతీయ రహదారిపై పెద్ద సంఖ్యలో పందెం రాయుళ్లు గుమికూడారు. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది.

తెలుగు తమ్ముళ్ల కొట్లాట

గుత్తి: బోరు బిల్లుల విషయంలో టీడీపీలో రెండు వర్గాల మధ్య కొట్లాట జరిగింది. వివరాలు.. ఎన్నికలకు ముందు, తర్వాత బోరు వేసిన బిల్లులు ఇప్పటి వరకూ చెల్లించలేదని, వీటిని వెంటనే మంజూరు చేయించాలంటూ టీడీపీ కార్యాలయంలో శనివారం రాత్రి ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం తనయుడు ఈశ్వర్‌ ఎదుట బోరు రిగ్గు నిర్వాహకుడు నాగరాజు వాపోయాడు. దీంతో అక్కడే ఉన్న టీడీపీ నేత చౌదరి జోక్యం చేసుకుని వాగ్వాదానికి దిగాడు. అక్కడే ఉన్న పలువురు నేతలు జోక్యం చేసుకుని సర్దిచెప్పడంతో అప్పటికి వివాదం సద్దుమణిగింది. అనంతరం ఇదే అంశాన్ని తనకు అత్యంత సన్నిహితుడైన గుత్తి ఆర్‌ఎస్‌కు చెందిన రాజాకు చౌదరి తెలిపాడు. దీంతో రాజా ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెంటనే నాగరాజుకు ఫోన్‌ చేసి దుర్భాషలాడాడు. ఎంత ధైర్యముంటే చౌదరితో వాదనకు దిగుతావ్‌ అంటూ గద్దించాడు. అదే స్థాయిలో బోర్‌ రిగ్గు నిర్వాహకుడు కూడా సమాధానమివ్వడంతో ఇద్దరి మధ్య ఫోన్‌లోనే మాటల యుద్ధం సాగింది. దమ్ముంటే గాంధీ సర్కిల్‌కు రావాలంటూ ఇద్దరూ సవాల్‌ విసురుకున్నారు. అక్కడితో ఆగకుండా గాంధీ సర్కిల్‌ వద్ద రాత్రి 11 గంటల సమయంలో పెద్దసంఖ్యలో తమ అనుచరవర్గాలను దింపారు. విషయం తెలుసుకున్న పోలీసులు సకాలంలో అక్కడకు చేరుకుని ఇరువర్గాల వారిని చెదరగొట్టారు.

నేడు కలెక్టరేట్‌లో  ఫిర్యాదుల స్వీకరణ 1
1/2

నేడు కలెక్టరేట్‌లో ఫిర్యాదుల స్వీకరణ

నేడు కలెక్టరేట్‌లో  ఫిర్యాదుల స్వీకరణ 2
2/2

నేడు కలెక్టరేట్‌లో ఫిర్యాదుల స్వీకరణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement