తారస్థాయికి ఖాకీల వేధింపులు | - | Sakshi
Sakshi News home page

తారస్థాయికి ఖాకీల వేధింపులు

Mar 6 2025 12:52 AM | Updated on Mar 6 2025 12:50 AM

అనంతపురం: రాప్తాడు పంచాయతీ పరిధిలోని ప్రసన్నాయపల్లికి చెందిన భూమిరెడ్డి మహానందరెడ్డిపై పోలీసుల వేధింపులు తారస్థాయికి చేరాయి. తరచూ పోలీసుస్టేషన్‌కు పిలవడం, ముందస్తు సమాచారం లేకుండానే నేరుగా ఇంట్లోకి వెళ్లి సోదాలు చేయడం వంటి ఘటనలతో కుటుంబ సభ్యులను భయాందోళనకు గురి చేస్తున్నారు. మహానందరెడ్డి సోదరుడు భూమిరెడ్డి శివప్రసాద్‌రెడ్డిని ప్రత్యర్థులు 2015 ఏప్రిల్‌ 29న రాప్తాడు తహసీల్దార్‌ కార్యాలయంలోనే దారుణంగా హత్య చేశారు. అనంతపురం అర్బన్‌ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ ఆ సమయంలో రాప్తాడు ఎంపీపీగా ఉన్నారు. అప్పట్లో దగ్గుపాటి కారును శివప్రసాదరెడ్డి హత్య కేసులోని నిందితులు వాడినట్లు తేలింది. ఈ క్రమంలో దగ్గుపాటి, మహానందరెడ్డి మధ్య విభేదాలు ఉన్నాయి.

సీఐ స్వామి భక్తి!

ఎమ్మెల్యే దగ్గుపాటి అండతో అనంతపురం వన్‌టౌన్‌ సీఐగా పోస్టింగ్‌ తెచ్చుకున్న రాజేంద్రనాథ్‌ యాదవ్‌ స్వామిభక్తి ప్రదర్శిస్తూ మహానందరెడ్డిని లక్ష్యంగా చేసుకుని వేధింపులకు గురి చేస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఇది పోలీసుల సాయంతో రాజకీయ కక్ష సాధింపులకు పరాకాష్టగా పలువురు పేర్కొంటున్నారు. మహానందరెడ్డి గత ఎన్నికల్లో దగ్గుపాటికి వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థి విజయం కోసం ముమ్మర ప్రచారం సాగించారు. దీంతో ఆయనపై కక్ష పెంచుకున్న ఎమ్మెల్యే దగ్గుపాటి పథకం ప్రకారం సీఐ రాజేంద్రనాథ్‌ యాదవ్‌ను రంగంలోకి దింపి కక్ష సాధింపులకు తెరలేపారనే ఆరోపణలు ఉన్నాయి. తాజాగా బుధవారం మహానందరెడ్డిని వన్‌టౌన్‌ పోలీసుస్టేషన్‌కు పిలుచుకెళ్లిన పోలీసులు కాసేపటి తర్వాత వదిలేశారు. అంతకు ముందు ఆయన ఇంట్లో విస్తృత సోదాలు చేశారు. ఇలా పది రోజులకోసారి సోదాలు నిర్వహించడం ప్రసన్నాయపల్లిలో కలకలం రేపుతోంది.

ప్రసన్నాయపల్లి మహానంద రెడ్డిని ముప్పుతిప్పలు పెడుతున్న వైనం

తరచూ ఇంట్లో సోదాలు

సీఐ రాజేంద్రనాథ్‌ తీరుపై విమర్శలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement