
విత్తన పప్పుశనగ నాణ్యతను పరిశీలిస్తున్న ఏడీఏ
అనంతపురం అర్బన్: మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా సోమవారం కలెక్టరేట్లో నిర్వహించాల్సిన ‘స్పందన’ కార్యక్రమాన్ని కలెక్టర్ గౌతమి ఆదేశాల మేరకు రద్దు చేసినట్లు డీఆర్ఓ గాయత్రీదేవి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.
విత్తన నాణ్యతలో రాజీపడొద్దు
అనంతపురం అగ్రికల్చర్: రబీ పంటల సాగుకు సంబంధించి రైతులకు 40 శాతం రాయితీతో పంపిణీ చేయనున్న విత్తన పప్పుశనగ నాణ్యత విషయంలో రాజీ పడొద్దని వ్యవసాయశాఖ ఏడీఏ రవి ఆదేశించారు. ఆదివారం నగరంలోని జశ్వంత్ సీడ్స్ ప్లాంట్లో విత్తనశుద్ది కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. నిబంధనలకు అనుగుణంగా నాణ్యతా ప్రమాణాలు పాటించి రైతులకు మంచి విత్తనం ఇవ్వడానికి అందరూ సహకరించాలని కోరారు.
పండుగలా పింఛన్ల పంపిణీ
అనంతపురం: జిల్లాలో ఆదివారం పింఛన్ల పంపిణీ పండుగలా సాగింది. వైఎస్సార్ పింఛన్ కానుకను ఆయా గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో వలంటీర్లు తెల్లవారుఝూము నుంచే ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేశారు. మొత్తం 2,88,338 మంది అవ్వాతాతలు, వితంతు, దివ్యాంగ, చేతివృత్తిదారులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు పింఛన్ల పంపిణీ చేయాల్సి ఉండగా.. తొలి రోజే 2,31,430 మందికి (80.26 శాతం) పింఛన్ పంపిణీ పూర్తయినట్లు డీఆర్డీఏ పీడీ ఐ.నరసింహారెడ్డి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా గత నెల నుంచి కొత్తగా 7,312 మంది పింఛన్ అందుకోవడానికి అర్హులుగా తేల్చారు. వీరికి కూడా పింఛన్ అందిస్తున్నారు.
అంబులెన్స్ బోల్తా..
మహిళ దుర్మరణం
● తల్లి మృతదేహాన్ని స్వస్థలానికి
తీసుకెళ్తుండగా ఘటన..
రాప్తాడురూరల్: అంబులెన్స్ అదుపుతప్పి రోడ్డు డివైడర్ను ఢీకొన్న ప్రమాదంలో మహిళ దుర్మరణం చెందింది. తల్లి మృతదేహాన్ని స్వస్థలానికి అంబులెన్స్లో తీసుకొస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ హృదయ విదాకర ఘటన ఆదివారం అనంతపురం రూరల్ మండలం సోములదొడ్డి సమీపంలో జరిగింది. రూరల్ పోలీసులు తెలిపిన మేరకు... కర్ణాటక రాష్ట్రం బీదర్కు చెందిన చంద్రకళ, సావిత్రిబాయి తల్లీకూతుళ్లు. శనివారం రాత్రి బెంగళూరు ఆస్పత్రిలో చంద్రకళ మృతి చెందడంతో కూతరు సావిత్రిబాయి మరో ఆరుగురు బంధువులతో కలిసి స్వస్థలం బీదర్కు అంబులెన్స్ వాహనంలో మృతదేహాన్ని తీసుకెళ్తున్నారు. సోములదొడ్డి సమీపంలోకి రాగానే ఆదివారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో అంబులెన్స్ డ్రైవరు నిద్ర మత్తులో డివైడర్ను ఢీకొట్టాడు. అదుపుతప్పిన వాహనం పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో సావిత్రిబాయి (36) ఎగిరి రోడ్డుమీద పడింది. తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయింది. మరో ముగ్గురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకున్నారు. బాధితులను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ఘటనా స్థలం నుంచి అంబులెన్స్నుపక్కకు తీస్తున్న జేసీబీ


అనంతపురం ఒకటో డివిజన్లో సుధాకర్కు వృద్ధాప్య పింఛన్ అందజేస్తున్న వలంటీర్ శ్రావణి