
రాయదుర్గం: మహిళలు, చిన్నారులకు సేవలందిస్తున్న అంగన్వాడీ కేంద్రాల్లో మౌలికసదుపాయాలు మెరుగుపరిచేందుకు జగన్ సర్కారు చర్యలు చేపట్టింది. జిల్లాలో 2,302 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటి పరిధిలో గర్భిణులు 16,756, బాలింతలు 14,178 మంది, 3– 6 ఏళ్లలోపు పిల్లలు 1,03,152 మంది ఉన్నారు. వీరికి పౌష్టికాహారంతో పాటు పూర్వ ప్రాథమిక విద్య అందేలా చర్యలు చేపట్టారు. ఇన్నాళ్లు కనీస మరమ్మతులకు నోచుకోని కేంద్రాలకు మహర్దశ కలిగేలా చర్యలు చేపట్టారు. జిల్లాలో 2,302 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా, 1,043 కేంద్రాలకు పక్కా భవనాలు ఉన్నాయి. 948 అద్దెభవనాల్లో కొనసాగుతున్నాయి. ఉచిత భవనాల్లో 311 కేంద్రాలు ఉన్నట్టు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. ‘నాడు– నేడు’ కార్యక్రమం కింద మొదటి దశలో జిల్లాలో 91 అంగన్వాడీ కేంద్రాలకు పక్కా భవన నిర్మాణాలు చేపట్టారు. వీటిలో ఇప్పటికే 22 పూర్తికాగా, మిగిలినవి వివిధ దశల్లో నిర్మాణాలు సాగుతున్నాయి. ఒక్కో భవనానికి రూ.13.50 లక్షలు వెచ్చిస్తున్నారు. రూ.10 లక్షలు భవన నిర్మాణానికి, రూ.2.80 లక్షలతో విద్యుత్, నీటి సౌకర్యం, ఫర్నీచర్, రూ.30 వేలతో టాయిలెట్లు, ఇంటర్నల్ వర్కులు చేస్తున్నారు. భవనాల అప్గ్రేడేషన్, ఆధునికీకరణకు గాను ఒక్కో కేంద్రానికి రూ.5.50 లక్షల వరకు ఖర్చు చేయనున్నారు.
పనుల్లో పారదర్శకత
భవన నిర్మాణ పనుల్లో పారదర్శకతకు పెద్దపీట వేశారు. పర్యవేక్షణ మొదలు నిధుల వినియోగం వరకు కమిటీ సభ్యులకు బాధ్యతలు అప్పగించారు. ప్రతి అంగన్వాడీ కేంద్రానికి ఏడుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. కన్వీనర్గా ఐసీడీఎస్ సూపర్వైజర్, సభ్యులుగా అంగన్వాడీ టీచర్, గ్రామ/ వార్డు మహిళా పోలీసు, ఇంజినీరింగ్ అసిస్టెంట్తో పాటు చిన్నారుల తల్లులు ముగ్గురు ఉంటారు. కమిటీ పేరున బ్యాంకు ఖాతా తెరిచి, ఇద్దరికి చెక్ పవర్ ఇస్తారు. వీరి ద్వారా అవసరమైన నిధులు డ్రా చేస్తారు.
ప్రైవేటుకు దీటుగా ప్రీస్కూల్..
అంగన్వాడీ కేంద్రాల్లో సమూల మార్పులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. బాల్య దశలోనే విజ్ఞానం పెంపొందించడంతో పాటు ఆంగ్ల మాధ్యమంలో బోధనకు చర్యలు చేపట్టింది. ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషనల్ (ఈసీసీఈ) పథకం కింద మూడేళ్ల నుంచి ఆరేళ్లలోపు చిన్నారులకు సమగ్ర వికాసమే ధ్యేయంగా పలు కార్యక్రమాలను రూపొందించింది. బాలల్లోని సృజనాత్మకతను వెలికితీసేలా ఇప్పటికే పీపీ–1, పీపీ–2 పుస్తకాల ద్వారా ఆంగ్ల పదాల బోధన సాగుతోంది. ఆటపాటలతో చదువులు సాగేలా చర్యలు చేపట్టారు.
శుద్ధిజలం.. ఆరోగ్యానికి బలం..
తల్లులు, చిన్నారుల సంక్షేమానికి సీఎం జగన్ పెద్దపీట వేశారు. 15 లీటర్ల సామర్థ్యం కలిగిన నీటి శుద్ధ ప్లాంట్లను కేంద్రాల్లో ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలో 288 ఆర్వో ప్లాంట్ల ఏర్పాటు ప్రక్రియ పూర్తి చేశారు. శుద్ధిజల ప్లాంట్ల ఏర్పాటుతో నాణ్యమైన తాగునీరందిస్తున్నారు.
‘నాడు–నేడు’తో కేంద్రాలకు మహర్దశ
జిల్లాలో 91 చోట్ల భవన నిర్మాణాలు
ప్రైవేటుకు దీటుగా ప్రీస్కూల్ నిర్వహణ

బెణికల్లులో సుందరంగా రూపుదిద్దుకున్న అంగన్వాడీ కేంద్రం

అంగన్వాడీ కేంద్రంలో ఏర్పాటు చేసిన నీటి శుద్ధి ప్లాంట్