‘స్కిల్‌’ సూత్రధారి చంద్రబాబే : పైలా

అనంతపురం క్రైం: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ సూత్రధారి టీడీపీ అధినేత చంద్రబాబేనని, ఈ కుంభకోణంలో ఆయన కటకటాలకెళ్లడం ఖాయమని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య పేర్కొన్నారు. శనివారం ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నిరుద్యోగులకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ పేరుతో అప్పటి సీఎం హోదాలో చంద్రబాబు రూ.371 కోట్ల ప్రజాధనాన్ని దోచేశాడని ఆరోపించారు. మొత్తం రూ.3,356 కోట్ల విలువైన ఈ ప్రాజెక్ట్‌లో ప్రభుత్వ వాటా పది శాతం కాగా, సీమెన్స్‌ కంపెనీ 90 శాతం నిధులను భరిస్తున్నట్లుగా నకిలీ ఒప్పందాన్ని సృష్టించారన్నారు. ప్రపంచంలో ఏ ప్రైవేట్‌ కంపెనీ కూడా 90 శాతం నిధులను కేటాయించదనే ఇంగిత జ్ఞానం కూడా చంద్రబాబుకు లేకపోవడం దౌర్భాగ్యమన్నారు. పది శాతం నిధుల పేరుతో ఐదు విడతలుగా నిధులు విడుదల చేసి, స్వాహా చేశారన్నారు. ఈ డబ్బు మొత్తం షెల్‌ ద్వారా హవాలా రూపంలో చంద్రబాబు ఖాతాలో చేరిందన్నారు. ఈ కుంభకోణంపై జీఎస్‌టీ, ఇంటెలిజెన్స్‌, ఈడీ, సీఐడీ అధికారులు దర్యాప్తు చేస్తూ ఆధారాలతో సహా నిందితులను అరెస్ట్‌ చేస్తుంటే.. చంద్రబాబును కాపాడేందుకు టీడీపీ, ఎల్లో మీడియా కక్ష సాధింపు చేస్తున్నారంటూ దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు.

Read latest Ananthapur News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top