ఏయూక్యాంపస్: విశాఖపట్నం చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(వీసీసీఐ) ఆధ్వర్యంలో శుక్రవారం బీచ్ రోడ్డులోని ఒక హోటల్లో స్పీకర్ మీట్ కార్యక్రమం నిర్వహించారు. గూగుల్ ఇండియా కస్టమర్ ఎంగేజ్మెంట్ విభాగాధిపతి మైత్రేయి గణపతి కీలకోపన్యాసం అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కస్టమర్ ఎంగేజ్మెంట్ను బలోపేతం చేయడం, కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవడంలో ఏఐ టెక్నాలజీ పాత్రను వివరించారు. అభివృద్ధి చెందుతున్న డిజిట్ ప్రపంచంలో ఎంసెస్ఎంఈలు, పరిశ్రమల వాటాదారులకు ఎంతో ఉపయుక్తంగా ఈ ప్రసంగం నిలచింది. వీసీసీఐ అధ్యక్షుడు ఎం.సుదర్శన్ స్వామి ప్రారంభోపన్యాసం అందించారు. మ్యాపిల్ సాఫ్ట్వేర్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈవో శివ్కుమార్ మాట్లాడుతూ సాంకేతికత స్వీకరించడం, ఆవిష్కరణలు, భవిష్యత్కు సిద్ధమైన వ్యాపార వ్యూహాలను వివరించారు. డబ్ల్యూఎన్ఎస్ ఉపాధ్యక్షుడు ఆర్.ఎల్.నారాయణ మోడరేటర్గా నిర్వహించిన రెండో సెషన్లో కృష్ణ మోహన్, నీరజ్ సార్ధా, కీర్తన ఆనంద్, రాజేష్ పూసర్ల, పవన్ తదితరులు వ్యాపార విస్తరణ వ్యవస్థలకు సంబంధించిన విభిన్న అంశాలపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ చర్చలో పాల్గొన్నారు. వీసీసీఐ కార్యదర్శి పి.రాజేష్ వందన సమర్పణ చేశారు.


