అనకాపల్లి టౌన్ : పట్టణంలోని పదో తరగతి పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. తల్లిదండ్రులు విద్యార్థులతో సహా ఉదయం 8 గంటలకే పాఠశాలలకు చేరుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 102 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు జరగగా 20,510 మంది విద్యార్థులకు గాను 20,443 మంది విద్యార్థులు హాజరు కాగా 75 మంది విద్యార్థులు హాజరు కాలేదు. ఓపెన్ స్కూల్ పరీక్షలలో 451 విద్యార్థులకు గాను 390 మంది హాజరు కాగా 61 మంది హాజరు కాలేదు. ఈ కేంద్రాల్లో ఏడు స్కాడ్ బృందాలు 41 పరీక్ష కేంద్రాలను తనిఖీలు చేశారు. పరీక్షలు సందర్భంగా ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని డీఈవో అప్పారావు నాయుడు తెలిపారు. ప్రతి ప్రశ్నపత్నం కూడా క్యూ ఆర్ కోడ్ ముద్రించారు. దీని వల్ల అవకతవకలు జరగడానికి ఆస్కారం ఉండదని అధికారులు పేర్కొంటున్నారు.
నడవలేని స్థితిలోనూ పరీక్షకు హాజరు
దేవరాపల్లి: తామరబ్బ పంచాయతీ పల్లపుకోడాబు గ్రామానికి చెందిన విద్యార్థి టోకురి దుర్గా ప్రసాద్కు నెల రోజుల క్రితం తెనుగుపూడి గురుకుల విద్యాలయం మేడపై నుంచి జారి పడిపోవడంతో నడుం విరిగిపోయింది. నడవలేని స్థితిలో ఉన్న అతడిని తన తల్లిదండ్రులు ఆటోలో దేవరాపల్లిలో పరీక్ష కేంద్రానికి తీసుకువచ్చారు. స్థానికుల సహాయంతో చేతులపై మోసుకుంటూ అతికష్టం మీద పరీక్ష గదిలోకి తీసుకెళ్లగా అధికారుల అనుమతితో స్కైబ్ సహాయంతో పరీక్ష రాశాడు.
కశింకోట : స్థానిక బాలికల హైస్కూల్లో ఇద్దరు, తాళ్లపాలెంలో ఒకరు, నరసింగబిల్లిలో ఒకరు దివ్యాంగులు సహాయకుల సహకారంతో పరీక్షలు రాశారు. కాగా స్థానిక హౌసింగ్ కాలనీకి చెందిన దివ్యాంగుడు కల్లంపల్లి ధన హర్షను స్థానిక బాలికల హైస్కూలు పరీక్ష కేంద్రానికి తల్లిదండ్రులు ఆటోలో తీసుకు వచ్చారు. పరీక్ష రాయడానికి ఒక సహాయకున్ని కూడా ఇచ్చారు. అయితే మూడున్నర గంటల పాటు పరీక్ష రాయాలంటే కూర్చోవడానికి శరీరం సహకరించదని చెప్పడంతో తల్లిదండ్రులు ఇంటికి తీసుకుపోయారు.


