అనకాపల్లి/చోడవరం : గంజాయి కేసులో ఇద్దరు నిందితులకు పదేళ్లు చొప్పున కఠిన కారాగార శిక్ష, చెరో రూ.లక్ష జరిమానా విధిస్తూ చోడవరం 9వ అదనపు జిల్లా కోర్టు సోమవారం తీర్పు వెలువరించిందని ఎస్పీ తుహిన్సిన్హా సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వివరాల్లోకి వెళితే...2016 సెప్టెంబర్ 2 చోడవరం మండలం గౌరీపట్నం జంక్షన్ వద్ద గంజాయి అక్రమ రవాణా చేస్తుండగా పోలీసులు తనిఖీల్లో ఇద్దరిని పట్టుకొని 148 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని రవాణా చేస్తున్న వంతల జయరామ్, గొల్లూరు భీమరాజుపై అప్పటి ఎస్ఐ నర్సింహమూర్తి కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఈ కేసులో అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ చీపురపల్లి సూర్యనారాయణ అన్ని వివరాలు కోర్టుకు అందించారు. చోడవరం 9వ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి హరినారాయణ వాదనలు విని, నిందితులపై నేరం రుజువు కావడంతో శిక్ష ఖరారు చేశారు. ఒక్కొక్కరికి 10 ఏళ్లు కఠిన కారాగార శిక్ష, రూ.లక్ష చొప్పున జరిమానా చెల్లించాలని, జరిమానా చెల్లించలేని పక్షంలో మరో ఏడాదిపాటు సాధారణ జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పినట్టు ఎస్పీ వెల్లడించారు. జిల్లాలో గంజాయి అక్రమ రవాణాకు పాల్పడే వారిపై పోలీసు శాఖ ఉక్కుపాదం మోపుతుందన్నారు. గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దడానికి ప్రజలు పోలీసువారికి సహకరించాలని కోరారు. ఈ కేసులో నేరస్తులకు శిక్ష పడేలా అన్ని సాక్షాధారాలు సేకరించిన వారందరికీ ఎస్పీ అభినందనలు తెలిపారు.


