నదిలో తవ్వకాలు చేస్తున్న జేసీబీ, పక్కన ట్రాక్టర్
మాకవరపాలెం: మండలంలోని నారాయణరాజుపేట వద్ద సర్పానదిలో అక్రమంగా మట్టి తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. అనుమతులు లేకుండా జేసీబీతో సోమవారం మట్టి తవ్వకాలు చేపట్టారు. స్థానిక టీడీపీకి చెందిన వారు మట్టిని ట్రాక్టర్లతో తరలిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. దీంతో ఇస్టానుసారంగా మట్టిని తరలిస్తున్నారన్నారు. మట్టి తవ్విన గోతుల కారణంగా భవిష్యత్తులో పశువులు ప్రమాదాల బారిన పడతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలంలో నదిలో నీటి ఉధృతికి సమీప భూములు కోతకు గురవుతాయని వాపోతున్నారు. అధికారులు స్పందించి మట్టి తవ్వకాలను నిరోధించాలని కోరుతున్నారు. ఇదే విషయమై తహసీల్దార్ ముజీబ్ను సంప్రదించగా తన దృష్టికి రావడంతో సిబ్బందిని పంపించి నిలిపివేయించామన్నారు. అనుమతులు లేకుండా తవ్వకాలు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


