వేండ్ర త్రినాథ్ను శాలువాతో సత్కరిస్తున్న ఆలయ కమిటీ సభ్యులు
అనకాపల్లి: దేవాలయాలకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అర్చకులు, కమిటీ సభ్యులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని దేవదాయ ధర్మాదాయ శాఖ రీజనల్ జాయింట్ కమిషనర్, అన్నవరం దేవస్థానం ఈవో వేండ్ర త్రినాథ్ తెలిపారు. స్థానిక దేవునిగుమ్మం వేంకటేశ్వరస్వామిని సోమవారం ఆయన దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు శాలువాలతో త్రినాథ్ను సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వామివారు ప్రత్యేక రోజుల్లో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుందని, వేసవి సెలవుల్లో విద్యార్థులు కుటుంబ సమేతంగా దర్శించుకునేందుకు వస్తారని, అటువంటి సమయంలో మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో ఆలయ ఉత్సవ కమిటీ సభ్యుడు బొలిశెట్టి శ్రీనివాసరావు, అర్చకులు పులకండం విజయబాబు, పులకండం రాజేష్, తదితరులు పాల్గొన్నారు.


