హక్కుల రక్షణ.. అందరి బాధ్యత
ఏయూక్యాంపస్: అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం పురస్కరించుకుని బుధవారం బీచ్రోడ్డులో ర్యాలీ జరిగింది. జాతీయ మానవ హక్కుల పరిరక్షణ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె.మాధవీలత అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి డీఎల్ఎస్ఏ న్యాయమూర్తి ఆర్.సన్యాసినాయుడు, జిల్లా వినియోగదారుల ఫోరం న్యాయమూర్తి తనూజరెడ్డి, ఎన్హెచ్ఆర్ఎఫ్ సంస్థ సీటీవో టి.ఎస్.రామచంద్రనాయుడు, విశాఖ న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఎం.కె.శ్రీనివాస్, ఏయూ న్యాయ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య కె.సీతామాణిక్యం తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శాంతిని కాంక్షిస్తూ అతిథులు పావురాలను ఎగురవేశారు. మానవ హక్కుల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని పిలుపునిస్తూ.. వాటి ప్రాముఖ్యాన్ని చాటిచెప్పేలా ఈ ర్యాలీని చేపట్టారు. కార్యక్రమంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, న్యాయవాదులు, న్యాయ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు.


