
అనకాపల్లిలో ఆపరేషన్ కగార్పై 2న సదస్సు
కె.కోటపాడు : సీపీఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో అనకాపల్లిలోని రోటరీ హాల్లో వచ్చేనెల 2న ఆపరేషన్ కగార్పై సదస్సు నిర్వహించనున్నట్టు ఆ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి రాజాన దొరబాబు తెలిపారు. ఈ మేరకు కె.కోటపాడులో బుధవారం సదస్సు కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని మోదీ ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో దండకారణ్యంలో నెత్తుటి ఏరులు పారిస్తున్నారని ఆరోపించారు. ఈ ఆపరేషన్ పేరిట మావోయిస్టులను ఏరివేసి, అటవీ సంపదను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడమే లక్ష్యంగా కనిపిస్తుందన్నారు. 2005లో సల్వాజుడుం, 2009లో ఆపరేషన్ గ్రీన్ హంట్ పేరుతో నరమేధంను సృష్టించి.. దానికి కొనసాగింపుగా ఆపరేషన్ కగార్ను తీసుకొచ్చారని ఆయన విమర్శించారు. ఏపీతో పాటు ఐదు రాష్ట్రాల్లో 28 రకాలైన విలువైన ఖనిజాలు విస్తరించి ఉన్నాయని, ఈ సంపదను దోచుకోవడానికి కార్పొరేట్ శక్తులు ఎన్నో ఏళ్లుగా ప్రయత్నాలు సాగిస్తున్నట్లు ఆయన ఆరోపించారు. కేవలం వాటి కోసమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టుల ఏరివేత చేపట్టారన్న వాదన బలంగా ఉందన్నారు. ఈ సదస్సుకు మేధావులు, ప్రజలు పెద్ద సంఖ్యలో రావాలని దొరబాబు కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు గొర్లె దేముడుబాబు, వేచలపు కాసుబాబు, వేమల కన్నబాబు, శరగడం పరమేష్, పొంతపల్లి రామారావు, రెడ్డి అప్పలనాయుడు, వియ్యపు రాజు పాల్గొన్నారు.