
కదిలివచ్చిన రెవెన్యూ యంత్రాంగం
మునగపాక: ‘రీ–సర్వే సవరణకు ముప్పుతిప్పలు’ పేరిట గురువారం సాక్షి దినపత్రికలో వచ్చిన కథనానికి జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ స్పందించారు. ఆమె ఆదేశాలతో రెవెన్యూ అధికారులు కదిలి వచ్చి, బాధిత రైతును కలిసి వివరాలు తీసుకున్నారు. వెంటనే సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. తన భూమికి సంబంధించి రీ–సర్వేలో జరిగిన లోపాలను సవరించి తనకు న్యాయం చేయాలని కోరుతూ మునగపాకకు చెందిన రైతు పీలా అప్పారావు అధికారుల చుట్టూ పదే పదే తిరిగినా ఫలితం లేకపోవడంతో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్లో సైతం ఫిర్యాదు చేశారు. నెలలు గడుస్తున్నా తన సమస్య పరిష్కారం కాలేదని ‘సాక్షి’ వద్ద తన గోడు వినిపించుకున్నారు. గురువారం వెలువడిన వార్తా కథనానికి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తహసీల్దార్ ఆదిమహేశ్వరరావు, డీటీ శేషుబాబు, ఆర్ఐ పడాల్, సర్వేయర్, వీఆర్వోలు రైతు అప్పారావు పొలానికి చేరుకొని రికార్డులు అక్కడికక్కడే పరిశీలించారు. అప్పారావుకు సంబంధించిన భూమికి అతని పాస్ పుస్తకంలోని సర్వే నెంబరుకు సరిపడేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అప్పారావుకు రీ–సర్వేలో ఎటువంటి ఇబ్బంది లేకుండా న్యాయం జరిగేలా కృషి చేస్తామని చెప్పారు.
‘రీ–సర్వే సవరణకు ముప్పుతిప్పలు’ వార్తకు స్పందన
కలెక్టర్ ఆదేశాలతో బాధిత రైతును కలిసిన తహసీల్దార్
సమస్య పరిష్కరించి న్యాయం చేస్తామని హామీ

కదిలివచ్చిన రెవెన్యూ యంత్రాంగం