
అవినీతి, దోపిడీయే కూటమి ప్రభుత్వ ధ్యేయం
చోడవరం : కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది కాలం పూర్తయినా వారి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలేవీ నెరవేర్చకుండా మహానాడులో టీడీపీ సంబరాలు చేసుకోవడం సిగ్గు చేటని వైఎస్సార్సీపీ అనకాపల్లి పార్లమెంటు సమన్వయకర్త కరణం ధర్మశ్రీ ఎద్దేవా చేశారు. చోడవరంలో పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గతేడాది జూన్ 4న కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిందని, ఈ ఏడాది కాలంలో హామీలేవీ నెరవేర్చలేదని ధ్వజమెత్తారు. మహానాడులో చంద్రబాబుకు మీరే హీరో అంటూ డబ్బా కొట్టుకున్నారు తప్ప ప్రజల కోసం ఏం చేశారని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్సీపీ నాయకులపై తప్పుడు కేసులు బనాయిస్తూ, నోటీసులు ఇవ్వకుండా భవనాలు కూల్చేస్తూ నానా ఇబ్బందులు పెడుతూ నిలదీసిన వారిపై కూడా కేసులు పెడుతున్నారన్నారు. ఎన్ని కష్టాలైనా మా నాయకుడు జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో ప్రజల పక్షాన నిరంతరం వైఎస్సార్సీపీ పోరాటాలు చేస్తూనే ఉంటుందన్నారు. దీనిలో భాగంగానే జూన్ 4న వెన్నుపోటు దిన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. చోడవరం పట్టణంలో ఈ కార్యక్రమం జరుగుతుందని, పెద్దసంఖ్యలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొని కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ఎండగట్టి ప్రజలకు తెలియజేయాలన్నారు. అనకాపల్లి పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ వెన్నుపోటు దినం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. గతంలో చిన్నచిన్న గోతులు ఉన్న రోడ్లనే తాము బాగు చేయించలేదని ఎన్నికల ముందు గగ్గోలు పెట్టిన కూటమి నాయకులు ఇప్పుడు ఏడాది కాలంలో ఏ రోడ్డు బాగుచేయించారని ప్రశ్నించారు.
వైస్సార్సీపీ హయాంలో నిధులు మంజూరు చేసినా కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో పనులు చేయకుండా వదిలేశారని, అధికారంలోకి వస్తే మేము చేయించేస్తామని చెప్పిన టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీ ఇప్పుడు ఏమయ్యారని ధర్మశ్రీ ప్రశ్నించారు. రోజుకి రూ.లక్ష చొప్పున జిల్లా మంత్రులు, నాయకులకు కప్పం చెల్లించాల్సిన దోపిడీకి కూటమి ప్రజాప్రతినిధులు తెరతీశారని ధర్మశ్రీ ఆరోపించారు.
మహానాడులో టీడీపీ సొంత డబ్బా
హామీలు అమలు చేయకుండా సంబరాలు సిగ్గుచేటు
జూన్ 4న వెన్నుపోటు దినం పేరుతో ఆందోళన
వైఎస్సార్సీపీ పార్లమెంటు సమన్వయకర్త కరణం ధర్మశ్రీ