
డీటీవో భవనం మెట్లు కూలి గాయపడ్డ సిబ్బంది
మహారాణిపేట: కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో ఉన్న జిల్లా ట్రెజరీ కార్యాలయం(డీటీవో) మెట్లు పాక్షికంగా కూలిపోయాయి. రెండు రోజులుగా కురిసిన వర్షాలకు ట్రెజరీ కార్యాలయానికి వెళ్లే ఐరన్ మెట్లలో ఓ భాగం పడిపోయింది. ఈ ఘటనలో ఆఫీస్ సబార్డినేట్ ప్రసాద్ తలకు గాయం అయింది. తృటిలో ప్రాణాపాయం తప్పిందని సిబ్బది ఊపిరి పీల్చుకున్నారు.
వర్షం కురిస్తే భయం
ఎప్పుడు వర్షం కురిసినా ట్రెజరీ కార్యాలయ పరిస్థితి దారుణంగా ఉంటుంది. 2014లో వచ్చిన హుద్హుద్ తుపానుకు పూర్తిగా ధ్వంసమైన భవనంలోనే ఇప్పటికీ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. వర్షం పడితే ఆ భవనంలో ఉండేందుకు భయపడే పరిస్థితి. కొన్ని రోజుల క్రితం ఇదే కార్యాలయానికి చెందిన ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్ పూర్తిగా కూలిపోయింది. సిబ్బంది విధుల్లో లేని సమయంలో ఆ సంఘటన జరగడంతో ప్రాణనష్టం వాటిల్లలేదు. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం కార్యాలయ మార్పునకు చొరవచూపట్లేదు.
పక్కనే పక్కా భవనం..!
జిల్లా ట్రెజరీ కార్యాలయానికి నూతన భవనాన్ని జిల్లా పరిషత్ పక్కన నిర్మించారు. ఎలక్ట్రిక్, చిన్నచిన్న పనులు మినహా భవనం సిద్ధంగా ఉంది. అయినప్పటికీ వివిధ సాంకేతిక కారాణాల పేరిట ఇంకా దీన్ని ప్రారంభించలేదు. తాజా ఘటనతో జిల్లా ట్రెజరీ అధికారి వై.సుధాకర్ కలెక్టర్ ఎం.ఎన్.హరేందిరప్రసాద్ దృష్టికి కార్యాలయ సమస్యను తీసుకెళ్లారు. దీంతో కలెక్టర్ స్పందించి కొత్త భవనం ప్రారంభోత్సవానికి ఆటంకాలపై ఆరా తీశారు.