
కాపులకు చంద్రబాబు వెన్నుపోటు
నక్కపల్లి: కాపుల ఓట్లతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్న విషయం మర్చిపోయి తిరిగి కాపులకే వెన్నుపోటు పొడిచేందుకు చంద్రబాబునాయుడు సిద్ధపడుతున్నారని రాష్ట్ర కాపు కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ వీసం రామకృష్ణ ఆరోపించారు. మంగళవారం ఆయన నక్కపల్లిలో విలేకర్లతో మాట్లాడుతూ తునిలో జరిగిన రైలు దగ్ధం కేసును తిరిగి తెరిపించి కాపు ఉద్యమకారులను జైలుకి పంపించాలనే కుట్రకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. తుని ఘటనకు సంబంధించిన కేసులను రైల్వే కోర్టు కొట్టివేసిందని, గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం కాపు ఉద్యమకారులపై టీడీపీ ప్రభుత్వంలో పెట్టిన కేసులు ఎత్తివేసిందన్నారు. ఈ కేసులను తిరిగి విచారణ చేపట్టే విధంగా హైకోర్టులో అప్పీలు దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం దుర్మార్గమన్నారు. కాపు జాతిని, కాపు నాయకులను పూర్తిగా అడ్డు తొలగించుకోవాలనే కుట్రతోనే చంద్రబాబు, లోకేష్లు ఈ చర్యలకు ఒడిగడుతున్నారని మండిపడ్డారు. కాపులకు రిజర్వేషన్లు ఇచ్చే ఉద్దేశం చంద్రబాబు ప్రభుత్వానికి లేదన్నారు. దీనిలో భాగంగా ఉద్యమ సమయంలో కేసులను తిరగదోడి భయపెట్టాలని ప్రయత్నిస్తున్నారన్నారు. కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని, వారి సంక్షేమానికి అధిక నిధులు కేటాయించాలని గతంలో జరిగిన ఉద్యమాల్లో అన్ని రాజకీయ పార్టీ నాయకులు ఉన్నారన్నారు. వీరందరిపై కక్ష కట్టి వేధిస్తే భవిష్యత్లో తమకు ఎదురు తిరగరన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు కేసులు రీ ఓపెన్ చేసేందుకు కంకణం కట్టుకున్నారన్నారు. జనసేన పార్టీ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన చంద్రబాబునాయుడు ఏదో రోజు పవన్ కల్యాణ్పై కేసులు పెట్టించి జైలుకు పంపినా ఆశ్చర్యపోనక్కర్లేదన్నారు. కాపులపై పెట్టిన కేసులు తిరగదోడాలని చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై పవన్ కల్యాణ్ స్పందించాలన్నారు. పవన్ కల్యాణ్ నాయకత్వాన్ని నమ్మి కాపులంతా గంపగుత్తుగా కూటమి పార్టీలకు ఓట్లేసి గెలిపించి అధికారాన్ని కట్టబెట్టారన్నారు. చంద్రబాబు లోకేష్లు చేస్తున్న కుట్రలపై జనసేన పార్టీతోపాటు, రాష్ట్రవ్యాప్తంగా అన్ని పార్టీల్లో ఉన్న కాపు నేతలు గుర్తించాలని కోరారు. ఈ సమావేశంలో వైస్ ఎంపీపీ వీసం నానాజీ, ఉపసర్పంచ్ వీసం రాజు, పార్టీ నాయకులు ముద్దా శ్రీను, అల్లాడ కొండ, దేవవరపు వెంకటసత్యనారాయణ, పోతంశెట్టి బాబ్జీ, అల్లాడ కొండ తదితరులు పాల్గొన్నారు.
రాజకీయంగా అణగదొక్కే కుట్ర
తుని రైలు కేసు రీ ఓపెన్ చేసేందుకు కంకణం
పవన్ కల్యాణ్ను కూడా ఏదో రోజు జైలుకి పంపిస్తాడు
కాపు కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ వీసం