
‘మధ్యాహ్న’ భోజన నిర్వాహకుల ఆకలి కేకలు
నాతవరం: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు వండి పెడుతున్న మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు గౌరవ వేతనం అందక నానా అవస్థలు పడుతున్నారు. నిర్వాహకులతో పాటు ఆయాలు నైట్ వాచ్మెన్లలకు మార్చి నుంచి గౌరవ వేతనాలు మంజూరు కాలేదు. జిల్లాలో అన్ని పాఠశాలలను కలుపుకొని మొత్తం 2,641 మంది మధ్యాహ్న భోజన పథకంలో పని చేస్తున్నారు. వీరికి ప్రభుత్వం మార్చి, ఏప్రిల్కు సంబంధించి ఆహార పదార్థాల సామగ్రి బిల్లులు ఇంత వరకు చెల్లించలేదు. అలాగే నిర్వాహకులకు రూ.3 వేలు చొప్పున రెండు నెలలకు సంబంధించి రూ.6 వేలు గౌరవ వేతనం కూడా అందలేదు. జిల్లా వ్యాప్తంగా పాఠశాలల్లో ఆయాలు 1,551 మంది పని చేస్తున్నారు. వీరికి మార్చి నుంచి గౌరవ వేతనం కూటమి ప్రభుత్వం చెల్లించలేదు. జిల్లాలోని హైస్కూళ్లలో 204 మంది నైట్ వాచ్మెన్లు పని చేస్తున్నారు. వీరికి రూ.6 వేలు చొప్పున మార్చి నుంచి మే నెల మూడు నెలలకు రూ.18 వేలు చెల్లించాలి. గత విద్యా సంవత్సరానికి సంబంధించి మధ్యాహ్న భోజన పథకం బిల్లులు, నిర్వాహకులు, ఆయాలు, నైట్వాచ్మెన్లకు గౌరవ వేతనాలు ఇవ్వకుండా ప్రభుత్వం జాప్యం చేయడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇప్పటికై నా ఉన్నతాధికారులు దృష్టి సారించి తమ ఆకలి సమస్య తీర్చాలంటూ వేడుకుంటున్నారు. ఈ విషయంపై నాతవరం ఎంఈవో కామిరెడ్డి వరహాలబాబును వివరణ కోరగా.. ప్రభుత్వ నిబంధనల ప్రకారం సకాలంలో బిల్లులు ఆన్లైన్లో తయారు చేసి పంపించామన్నారు. ప్రభుత్వం నేరుగా బ్యాంకు అకౌంట్లలోనే గౌరవ వేతనం వేస్తుందని, ఈ సమస్య ఉన్నతాధికారులు దృష్టిలో ఉందన్నారు.