
రైస్ మిల్లుల తనిఖీ
చోడవరం: పీడీఎస్ బియ్యం కొనుగోలు,అమ్మకాలు చేస్తే చర్యలు తీసుకుంటామని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి కె.వి.ఎల్.ఎన్. మూర్తి హెచ్చరించారు. మండలంలో వెంకన్నపాలెం, ముద్దుర్తి గ్రామాల్లో రైస్ మిల్లులను ఆదివారం ఆయన తనిఖీ చేశారు. స్టాక్ రికార్డులు పరిశీలించి, ధాన్యం, బియ్యం నిల్వల శాంపిల్స్ను తీసి పరీక్షలకు పంపారు. చౌక ధరల దుకాణాల ద్వారా పేదలకు ఇచ్చే బియ్యాన్ని రైస్ మిల్లర్లు కొనుగోలు, అమ్మకాలు చేయరాదని, అటువంటివి జరిగినట్టు తమ పరిశీలనలో తేలితే కేసులు పెడతామని డీఎస్వో హెచ్చరించారు. అనంతరం గత ఖరీఫ్, రబీ సీజన్లలో రైతుల నుంచి ధాన్యం కొనుగోలుపై ఆరా తీసి, రికార్డులను పరిశీలించారు. బియ్యం ఎగుమతుల రికార్డులను పూర్తిస్థాయిలో నిర్వహించాలని ఆదేశించారు. ఈ తనిఖీల్లో రెవెన్యూ, పౌరసరఫరాలశాఖ అధికారులు పాల్గొన్నారు.