
వంచన.. వేదన
అక్రమ కేసులు.. దాడులు
పెట్టుబడి సాయం ఏదీ..
నాకు నాతవరం మండలం గునిపూడి గ్రామంలో నాలుగు ఎకరాల భూమి ఉంది. గతేడాది నాలుగు ఎకరాల్లోనూ వరి పంట వేశాను. ‘అన్నదాత సుఖీభవ’ పేరిట ప్రభుత్వం అందిస్తామన్న పెట్టుబడి సాయం అందించకపోవడం, వాతావరణ పరిస్థితులు సరిగ్గా లేకపోవడంతో నష్టం వచ్చింది. ధాన్యం కొనుగోలు దళారుల చేతుల్లో పెట్టడం వల్ల ధర పెంచలేదు. దీంతో బ్యాంక్ నుంచి తెచ్చిన వ్యవసాయ రుణం తీర్చలేకపోయాను. అసలుకు వడ్డీ కలిసి భారంగా మారింది. బ్యాంక్ నుంచి గతంలో తీసుకున్న రుణం చెల్లిస్తేనే కొత్త రుణాలు ఇస్తామని బ్యాంక్ అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది కూడా ప్రభుత్వం పెట్టుబడి సాయం ఇవ్వకపోతే నాకున్న నాలుగు ఎకరాల్లో సగం మాత్రమే వరి పంట వేస్తాను.
– వి.సూరిబాబు, గునిపూడి,
నాతవరం
భర్త చనిపోయినాపింఛన్ రాలేదు..
ఎస్.రాయవరం మండలంలో హోం మంత్రి క్యాంపు కార్యాలయానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న కొరుప్రోలు గ్రామం మాది. నా భర్త చనిపోయి ఏడాదిన్నర అవుతున్నా పింఛన్ మంజూరు కాలేదు. కొత్త ప్రభుత్వం వచ్చిన తరువాత ఏడాది కాలంలో భర్తలు చనిపోయిన చాలా మందికి పింఛన్ మంజూరు చేశారు. నా భర్త ముందే చనిపోవడం నేను చేసుకున్న పాపమా? 50 సంవత్సరాల వయసులో ఏ పనీ చేయలేని స్థితిలో ఉన్నా ను. గత ప్రభుత్వం అందించిన కాపు నేస్తం, డ్వాక్రా నగదు ఎంతో కొంత ఆసరాగా ఉండేది. ఎన్నికల ముందు ఇచ్చిన దరఖాస్తు పరిశీలించేలోగా ఎన్నికలు వచ్చాయి. అవి అయ్యాక ఏడాది కాలంగా నాయకుల చుట్టూ తిరిగినా పింఛన్ మంజూరు కాలేదు.
– దమ్ము సత్యవతి, కొరుప్రోలు గ్రామం, ఎస్.రాయవరం మండలం
క్రిమినల్ కేసులు బనాయించి తొలగించారు..
నేను ఎటువంటి అవకతవకలకు పాల్పడకపోయినా.. తప్పులు చేయకపోయినా.. కూటమి ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోనే ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేస్తున్న నన్ను అన్యాయంగా తొలగించారు. హోం మంత్రి వంగలపూడి అనిత అప్పటి డ్వామా పీడీపై ఒత్తిడి తెచ్చి మరీ నన్ను తీసేయించారు. డ్వామా పీడీ సందీప్తో మాకు ఫోన్ చేయించి రాజీనామా చేయాలని చెప్పించారు. నేను చేయనని చెప్పాను. నాపై క్రిమినల్ కేసులు పెట్టి మరీ తొలగించారు. 16 ఏళ్లు ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేశాను. మా యాక్ట్ ప్రకా రం తప్పు చేస్తే థర్డ్ పార్టీ విచారణ గానీ, క్వాలిటీ కంట్రోల్ విచారణ గానీ చేసి తొలగించాలి. కానీ దానికి విరుద్ధంగా నన్ను విధుల నుంచి తీసేశారు. నాపై ఎందుకింత కక్ష?
– మేకా సోమయ్య, ఫీల్డ్ అసిస్టెంట్, ఈదటం, పాయకరావుపేట నియోజకవర్గం
సాక్షి, అనకాపల్లి: వెన్నుపోటు వెన్నతో పెట్టిన విద్య.. నమ్మిన వారిని నట్టేట ముంచడంలో ఘనాపాటీలు.. సూపర్ సిక్స్ మోసం ఫిక్స్ అని జనం గగ్గోలు.. తల్లికి వందనం అంటూ పంగనామాలు పెట్టారు. స్కూలుకు వెళ్లే ప్రతి బిడ్డకూ ఇస్తామన్నారు. అధికారంలోకి వచ్చి రెండో ఏట అడుగుపెడుతున్నా ఇంకా ఆ హామీ విద్యార్థుల తల్లిదండ్రులను ఊరిస్తూనే ఉంది. అన్నదాత సుఖీభవ పేరిట ప్రతి రైతుకు ఏటా రూ.20 వేల ఆర్థిక సహాయం, నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల భృతి, నెలకు రూ.1500ల ఆడబిడ్డ నిధి, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. ఇలా హామీలన్నింటినీ తుంగలోకి తొక్కారు. కూటమి ప్రభుత్వ నేతల అరాచకాలను ప్రశ్నిస్తే వారిపై అక్రమ కేసులు బనాయించి అణిచివేతకు గురిచేయడం.. లేదంటే వారిపై దాడులు, అడ్డు తొలగించేందుకు హత్యాయత్నాలతో అరాచకం.. జిల్లాలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన మరుక్షణం నుంచే కూటమి నేతలు దాడులు, హత్యలు, దౌర్జన్యాలతో బరి తెగించారు. లేటరైట్, ఇసుక, మద్యం, అక్రమ మైనింగ్, గ్రావెల్ మాఫియా చెలరేగిపోతున్నారు. వీధివీధినా బెల్టు షాపులతో విచ్చలవిడి మద్యంతో మహిళలపై దాడులు, చిన్నారులపై అఘాయిత్యాలు ఎక్కువయ్యాయి. కూటమి పార్టీల అధినేతలే కాదు ఎంపీ, ఎమ్మెల్యేలు కూడా స్థానికంగా ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల ఊసెత్తడం లేదు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన.. అడుగడుగునా దగా దగా అంటూ సామాన్య ప్రజలు వాపోతున్నారు.
అర్హత ఉన్నాపింఛన్ కట్ చేశారు..
నాకు ఒక కన్ను పుట్టుక నుంచి పూర్తిగా కనిపించదు. రెండో కన్ను కూడా మసక మసకగా ఉంటుంది. కూలీ నాలీ చేసు కోలేని పరిస్థితిలో ఉన్నాను. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పింఛన్ వచ్చేది. ఆ సొమ్ముతో ఇల్లు గడిచేది. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో పింఛన్ తీసేశారు. నేను కూలికి కూడా వెళ్లలేకపోతున్నాను. నాకు ఏ కారణంగా పింఛన్ తీసేశారని కలెక్టర్, ఆర్డీవో, ఎమ్మార్వోలకు వినతిపత్రాలు ఇచ్చాను. కానీ ఇప్పటివరకూ పింఛను ఇవ్వలేదు.
– వరలక్ష్మి, దివ్యాంగురాలు, పాకలపాడు, గొలుగొండ మండలం
లబ్దిదారుల ఎదురుచూపులు..
● జిల్లాలో ‘అన్నదాత సుఖీభవ’ కోసం సుమారు 2,65,778 మంది రైతులు ఎదురు చూస్తున్నారు. గతేడాది, ఈ ఏడాది కలిపి రూ.1,063 కోట్ల పెట్టుబడి సాయం వారికి అందాల్సి ఉంది.
● ఏడాదికి 2,13,190 మంది విద్యార్థుల తల్లులకు రూ.15 వేలు వంతున రూ.319 కోట్లు అందాలి. రెండేళ్లకు కలిపి రూ.638 కోట్ల బాకీ
● ప్రతి మహిళకు నెలకు రూ.1500 చొప్పున జిల్లాలో 18 ఏళ్లు దాటిన 5,47,888 మంది మహిళలకు ‘ఆడబిడ్డ నిధి’ ఏడాదికి రూ.986.19 కోట్లు అందించాలి. రెండేళ్లకు రూ.1972.38 కోట్ల బాకీ.
● అధికారుల లెక్కల ప్రకారం జిల్లాలో 2.30 లక్షల మంది నిరుద్యోగులు. వారికి రూ.3 వేల వంతున నెలకు రూ.69 కోట్లు, ఏడాదికి రూ.828 కోట్లు ఇవ్వాలి.
● ఉచిత బస్సు ప్రయాణం పథకం కోసం జిల్లాలో 18 ఏళ్లు దాటిన మహిళలు 6,53,505 మంది, 5 నుంచి 18 ఏళ్ల బాలికలు 84,814 మంది ఎదురుచూస్తున్నారు.
హామీలకు తూట్లు..
ఎన్నికలకు ముందు కూటమి పార్టీలు చెప్పిన సూపర్ సిక్స్తోపాటు జిల్లాకు సంబంధించి మరో 143 హామీలు ఇచ్చారు. షరా మామూలుగా విస్మరించారు. ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులుగా కూటమి నేతలు స్థానిక అంశాలపై అనేక వాగ్దానాలు చేశారు. వాటికీ అతీగతీ లేదు.
పాయకరావుపేట బహిరంగ సభలో..
ఎన్నికలకు ముందు పాయకరావుపేటలో జరిగిన భారీ బహిరంగ సభలో చంద్రబాబు, పవన్ కల్యాణ్, వంగలపూడి అనిత అనేక హామీలు ఇచ్చారు. నక్కపల్లి డిగ్రీ కళాశాలకు నూతన భవనాల నిర్మాణం.. చిన దొడిగల్లులో అసంపూర్తిగా ఉన్న పీహెచ్సీ నిర్మాణం పూర్తి.. ఉద్దండపురంలో అసంపూర్తిగా ఉన్న వాటర్ గ్రిడ్కు నిధుల మంజూరు.. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు.. నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రామా కేర్ సెంటర్.. అడ్డురోడ్డు–నర్సీపట్నం రోడ్డు నిర్మాణం.. కోటవురట్ల మండలంలో రామచంద్రపురం జంక్షన్ నుంచి అడ్డురోడ్డు వరకు రహదారి నిర్మాణం... పాయకరావుపేట టౌన్లో మెయిన్ రోడ్డు విస్తరణ అందులో కొన్ని. వీటిలో ఒక్కటి కూడా పూర్తి చేయలేదు.
అనకాపల్లి సభలో..
జనసేన అధినేత పవన్ కల్యాణ్ అనకాపల్లి సభలో సీఎం రమేష్, కొణతాల రామకృష్ణతో కలిపి పలు హామీలు ఇచ్చారు. తుమ్మపాల సుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తాం.. అనకాపల్లిలో ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఒకేచోట ఉండేలా నూతన భవన సముదాయం నిర్మాణం.. కొత్త పరిశ్రమలను తీసుకొచ్చి యువతకు ఉద్యోగావకాశాలు.. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు పూర్తి చేసి జిల్లాలో ప్రతి ఎకరాకు సాగునీరు.. అనకాపల్లి టౌన్లో నడిబొడ్డున ఉన్న డంపింగ్ యార్ట్ తరలింపు.. ఆర్ఈసీఎస్ను ఏపీఈపీడీసీఎల్ నుంచి విడదీసి మళ్లీ స్వయం ప్రతిపత్తి కల్పిస్తాం.. గోవాడ సుగర్ ఫ్యాక్టరీ ఆధునికీకరణ.. వడ్డాది దగ్గర పెద్దేరు నదిపై, విజయరామరాజు పేట వద్ద తాచేరు నదిపై వంతెనల నిర్మాణం, రోలుగుంట–వడ్డాది రోడ్డు నిర్మాణం పూర్తి, రావికమతంలో జూనియర్ కళాశాల నిర్మాణం.. అందులో కొన్ని. వాటిలో ఒక్కటి కూడా నెరవేర్చలేదు.
ఏడాది కూటమి పాలనలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు, సోషల్ మీడియా యాక్టివిస్టులపై 91 అక్రమ కేసులు పెట్టారు. వైఎస్సార్సీపీ నేతలపై హత్యాయత్నాలు, దాడులకు కూడా పాల్పడ్డారు.
● నర్సీపట్నం నియోజకవర్గంలో ఇసుక దోపిడీని అడ్డుకున్నందుకు మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్తోపాటు 44 మందిపై అక్రమ కేసులు బనాయించారు.
● రెండు రోజుల క్రితం వైఎస్సార్సీపీ యూత్ లీడర్ అల్లంపల్లి ఈశ్వర్రావుపై రౌడీలతో హత్య చేయించేందుకు కుట్రలు పన్నారు.
● కక్ష సాధింపుతో వైబీ పట్నా నికి చెందిన చుక్కా రాంబాబుపై దాడి చేశారు. చిటెకెల కన్నపై కేసు నమోదు చేసి ఆయన ఇంటిని కూల్చేశారు.
● నర్సీపట్నం నియోజకవర్గం చీడిగొమ్మల గ్రామంలో టీడీపీ నేతలు దాడి చేసి కొట్టి..12 మంది వైఎస్సార్సీపీ యువ నాయకులపై కేసులు నమోదు చేశారు.
● గత ఏడాది జూలై 9న మాకవరపాలెం మండలం ఎరకన్నపాలెం గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ బూత్ కన్వీనర్ కొల్లి అప్పలనాయుడుపై 50 మందికి పైగా టీడీపీ గూండాలు కర్రలతో దాడి చేశారు. అడ్డుకున్న కొల్లి అప్పలనాయుడు తమ్ముడు రామారావు, తల్లి సత్యవతి, తండ్రి అప్పారావుపై కూడా కర్రలతో దాడి చేశారు.
● మాకవరపాలెంలో 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో నాటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని టీడీపీ కార్యకర్త లక్ష్మణ్ను వైఎస్సార్సీపీ నేతలు మందలించారు. ఈ వీడియోను ఈ ఏడాది ఏప్రిల్ 28వ తేదీన ఒక టీడీపీ నేత ట్విట్టర్లో పెట్టగా వైఎస్సార్సీపీ నేతలు రుత్తల సత్యనారాయణ, సర్పంచ్లు బొడ్డు గోవిందరావు, మాకిరెడ్డి అయ్యప్ప, పార్టీ నేత బండారు గాంధీపై అక్రమ కేసులు పెట్టి అర్ధరాత్రి పోలీస్స్టేషన్కు తరలించారు. న్యాయస్థానం మొట్టికాయలు పెట్టడంతో తోక ముడిచారు.
చంద్రబాబు బృందానికి వెన్నుపోటు వెన్నతో పెట్టిన విద్య
ప్రోగ్రెస్ రిపోర్ట్
ఎన్నికల హామీలను నమ్మి ఓట్లేసిన వారికి వంచన..
సంక్షేమ పథకాలు అందక బతుకు భారమై
సామాన్యుల వేదన..
వైఎస్సార్సీపీ సానుభూతిపరులని ఏమాత్రం అనిపించినా వారిపై కక్షసాధింపు.. అక్రమ కేసులు..
శాంతిభద్రతలు అదుపు తప్పినా.. నేరాల సంఖ్య పెరుగుతున్నా.. సాక్షాత్తూ హోం మంత్రి సొంత జిల్లాలో మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నా ఏమాత్రం పట్టించుకోని ప్రభుత్వ యంత్రాంగం..
గ్రావెల్ దోపిడీ, ఇసుక అక్రమ తవ్వకాలు,పైరవీలు, పథకాల పంపిణీలో అధికార పార్టీ నేతల పెత్తనం.. అంతా రాజకీయం..
ఇదీ కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై సామాన్యుడు ఇచ్చిన ప్రోగ్రెస్ రిపోర్ట్..

వంచన.. వేదన

వంచన.. వేదన

వంచన.. వేదన

వంచన.. వేదన

వంచన.. వేదన

వంచన.. వేదన

వంచన.. వేదన