
38 తోడపెద్దులకు అచ్చులు
అనకాపల్లి: స్థానిక గవరపాలెం చిన్నరామస్వామి దేవాలయంలో సూరిశెట్టి తోడపెద్దు అచ్చు సేవా కార్యక్రమాన్ని పీలా లక్ష్మణరావు ఆధ్వర్యంలో ఆలయ దేవాలయ చైర్మన్ వి.పైడారావు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పైడారావు మాట్లాడుతూ జిల్లాలో 38 తోడపెద్దులకు అచ్చులు వేశామన్నారు. ఈనెల 6వ తేదీన దేవాలయం వద్ద రాత్రి భజనలు, నేలవేషాలు, తప్పెటగుళ్లు, కోలాటాలతో అత్యంత వైభవంగా ఈ కార్యక్రమం నిర్వహించామని చెప్పారు. శనివారం దేవాలయం నుంచి పురవీధులు గుండా 38 తోడపెద్దులను శారదానది ఒడ్డు వరకూ ఊరేగించి, అక్కడ వాటికి స్నానం చేయించి, జిల్లాలో వివిధ ప్రాంతాలకు పంపించామన్నారు. ఈ ఏడాది జనవరి 1 నుంచి 15వ తేదీలోగా జన్మించిన ఎద్దులను సైజు, పుట్టుమచ్చలు చూసి ఎంచుకుని దేవాలయం వద్ద అచ్చు వేయడం జరిగిందన్నారు. తోడపెద్దులను దేవునికి అంకితం చేశామన్నారు. పూర్వం ఏ ఇంట్లో శుభకార్యమైనా ముందుగా తోడపెద్దుతో అడుగు పెట్టించి, వివాహాలు చేసేవారన్నారు. ఈ సందర్భంగా దేవాలయంలో అన్నసమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల తోడపెద్దు భక్తులు పాల్గొన్నారు.
శారదా నది వరకు ఘనంగా ఊరేగింపు