
సాక్షి పత్రిక కార్యాలయాల మీద దాడులు తగవు
మాడుగుల రూరల్ : రాష్టంలో వివిధ ప్రాంతాల్లో సాక్షి పత్రికా కార్యాలయాలపై టీడీపీ నేతలు, కార్యకర్తలు దాడులు చెయ్యడం అన్యాయమని జిల్లా వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి, చోడవరం సీడీసీ చైర్మన్ సుంకర శ్రీనివాసరావు ఒక ప్రకటనలో ఖండించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కక్ష సాధింపులు, రెడ్బుక్ పాలన, ఆక్రమ కేసులు బనాయించి గిట్టనివాళ్లను జైళ్లకు పంపడమే పనిగా పెట్టుకుందన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్న నేపథ్యంలో హామీల అమలు, వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడానికి ఇలాంటి దుష్ట సంప్రదాయానికి తెర దించిందన్నారు. సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును అక్రమంగా అరెస్టు చేయడం అన్యాయమన్నారు. జర్నలిస్టులను అక్రమంగా అరెస్టు చేయడం పత్రికా కార్యాలయాలపై దాడులు చేయడం ప్రజాస్వామ్యంలో హేయమైన చర్యని ఆయన తీవ్రంగా ఖండించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలు, జర్నలిస్టులు, ప్రతిపక్ష పార్టీ నాయకులు మీద దాడులు చేయడం ప్రభుత్వానికి పరిపాటి అయిందన్నారు. ఇటువంటి దాడులను ప్రతి ఒక్కరూ ఖండించాలని కోరారు.
అధికార పార్టీ ఆగడాలకు పరాకాష్ట
సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని అరెస్టు అన్యాయం
వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి సుంకర శ్రీనివాసరావు ఖండన