
మోగనుంది సమస్యల గంట
● నేటి నుంచి పాఠశాలలు
పునః ప్రారంభం
● పూర్తికాని ఉపాధ్యాయుల బదిలీలు
● అసంపూర్తిగా తరగతి, టాయిలెట్స్ నిర్మాణాలు
● పూర్తిస్థాయిలో రాని స్టూడెంట్ కిట్లు
● అసంపూర్తిగా నాడు–నేడు పనులు
● చాలా పాఠశాలల్లో పనిచేయని
ఆర్వో ప్లాంట్లు
స్టూడెంట్స్ కిట్స్ కొరత
జిల్లాలోని వివిధ మండలాల పరిధిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలకు పాఠ్యపుస్తకాల పంపిణీ ప్రక్రియకు విద్యాశాఖ అధికారులు శ్రీకారం చుట్టారు. జిల్లాలో మొత్తం 5,13,887 పుస్తకాల అవసరం ఉంది. ఇప్పటికే గాజువాకలో గల బుక్ డిపో నుంచి అనకాపల్లి జిల్లాలో గల వివిధ ప్రభుత్వ పాఠశాలలకు తరలించారు. విద్యార్థి మిత్ర కిట్లలో పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్తో పాటు బ్యాగ్, బూట్లు, సాక్సులు, యూనిఫాం, బెల్ట్ ఉండాలి. వాటిలో చాలాచోట్ల టై, బెల్ట్, బ్యాగ్ మాత్రమే వచ్చాయి. యూనిఫాంలు, బూట్లు, సాక్సులు రావాల్సి ఉంది. కొన్నిచోట్ల బ్యాగులు కూడా పూర్తి స్థాయిలో ఇంకా చేరలేదు.
సాక్షి, అనకాపల్లి: వేసవి సెలవులు పూర్తయ్యాయి. గురువారం నుంచి పాఠశాలలు తెరుచుకోనున్నాయి. ప్రైవేట్ పాఠశాలలు సకల సౌకర్యాలతో విద్యార్థుల తల్లిదండ్రులను రా రమ్మని స్వాగతం పలుకుతుండగా.. సర్కారు బడులు సౌకర్యాల లేమితోనే విద్యార్థులను ఆహ్వానిస్తున్నాయి. జిల్లాలో కొన్ని పాఠశాలల్లో మరుగుదొడ్లు, అదనపు తరగతి గదుల నిర్మాణాలు మధ్యలోనే నిలిచిపోయాయి. పలుపాఠశాలల్లో ఆర్వో ప్లాంట్లు పనిచేయడం లేదు. దీంతో విద్యార్థులకు తాగునీటి సమస్య తలెత్తనుంది. ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ ఇంకా పూర్తికాలేదు. విద్యార్థులకు పాఠశాలలు తెరిచే నాటికే పంపిణి చేయాల్సిన సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్లలో (స్టూడెంట్ కిట్స్) ఇంకా చాలా వస్తువులు రాలేదు. సాధారణంగా పాఠశాలలు పునఃప్రారంభం నాటికే విద్యా శాఖ అధికారులు అన్ని సిద్ధంచేయాలి. కానీ ఈ వి ద్యా సంవత్సరం అసౌకర్యాలతోఆరంభం కానుంది.
పూర్తికాని ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియ
పాఠశాలలు పునఃప్రారంభానికే ఉపాధ్యాయుల బదిలీలు ప్రక్రియ పూర్తిచేస్తామని విద్యాశాఖాధికారులు ముందుగానే ప్రకటించారు. కానీ ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. గురువారం పాఠశాలలు తెరుచుకోనున్నాయి. అయినా ఉపాధ్యాయులు బది లీ ప్రక్రియ సగభాగం కూడా పూర్తికాలేదు. ఈ ప్రక్రియ పూర్తికావడానికి మరికొన్ని రోజులు పడుతుందని ఉపాధ్యాయులే భావిస్తున్నారు. తక్కువ సంఖ్యలో ఉన్న స్కూల్ అసిస్టెంట్లు బదిలీ ప్రక్రియ పూర్తయినప్పటికీ.. అత్యధిక సంఖ్యలో ఉన్న సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియ మాత్రం ఇంతవరకు ఓకొలిక్కి రాలేదు. బుధవారం మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి వరకు 300 మందికి మాత్రమే మాన్యువల్ కౌన్సెలింగ్ జరిగింది. పాఠశాలలు తెరిచిన రోజైన గురువారం మరో 500 మందికి కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. వారంతా పాఠశాలలకు వెళ్లకుండా కౌన్సెలింగ్కు హాజరుకావాల్సిందే. దీంతో పాఠశాలలు మొదటి రోజు అరకొర ఉపాధ్యాయులతో ప్రారంభం కాబోతున్నాయి. ఉమ్మడి విశాఖ జిల్లాలో 2,782 మంది ఎస్జీటీలు కౌన్సెలింగ్కు దరఖాస్తు చేసుకొన్నారు. ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ఉంటే వారందరికీ కౌన్సెలింగ్ పూర్తయ్యేసరికి మరో వారం పడుతుందని అధికారులు అంటున్నారు.
పాఠశాలల కుదింపు.. ఉపాధ్యాయుల కొరత
విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరలేదని ఎంపీయూపీ స్కూల్స్ను ఎంపీపీ స్కూల్స్గా కొన్నిచోట్ల కుదించారు. దేవరాపల్లి మండలంలో వాకపల్లి, నాగయ్యపేట, రైవాడలో ఉన్న ఎంపీయూపీ స్కూల్స్ను ఎంపీపీ స్కూల్స్గా కుదించారు. కె.కోటపాడు మండలంలో కె.కోటపాడు, చౌడువాడ, పిండ్రంగి, దాలివలస ఎంపీయూపీ స్కూల్స్ను ప్రైమరీ మోడ ల్స్ స్కూల్స్గా మార్చారు. కోటవురట్ల మండలంలో ఎండపల్లి, చౌడువాడ, పందూరులో ఉన్న ఎంపీయూపీ స్కూల్స్ను ఎంపీపీ స్కూల్స్గా కుదించారు. స్కూల్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న చాలామంది ఉపాధ్యాయులు ప్రభుత్వం నుంచి వచ్చే ఒత్తిడి తట్టుకోలేక ఇటీవల జరిగిన బదిలీల్లో ప్రైమరీ స్కూల్ హెచ్ఎంలుగా బదిలీపై వెళ్లిపోయారు. వీరి స్థానంలో వచ్చేందుకు ఇతర ప్రాంతాల ఉపాధ్యాయులు ఆసక్తి చూపిండచం లేదు. దీంతో జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టు ఉపాధ్యాయులు, భాషా ఉపాధ్యాయుల కొరత ఏర్పడింది.
ఎక్కడి పనులు అక్కడే..
వైఎస్సార్సీపీ హయాంలో ‘నాడు–నేడు’లో భాగంగా ప్రభుత్వ పాఠశాలల ఆధునికీకరణ, మౌలిక వసతుల కల్పన చేపట్టారు. మొదటి విడతలో రూ.156.44 కోట్లతో 598 పాఠశాలల్లో, రెండో విడతలో రూ.112.54 కోట్లతో 616 పాఠశాలల్లో అభివృద్ధి పనులు చేపట్టి, గత ప్రభుత్వ హయాంలోనే 70 శాతం వరకు పూర్తి చేశారు. బెంచీలు, ఐఎఫ్బీ ప్యానెళ్లు, ఆధునిక వసతులతో కూడిన మరుగుదొడ్లు, డైనింగ్ హాళ్లు, తాగునీరు, వాడుకనీటి సదుపాయాలు కల్పించారు. కూటమి ప్రభుత్వం రావడం పాఠశాలల పాలిట శాపంగా మారింది. ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. పాయకరావుపేట నియోజకవర్గంలో దేవవరం, చినదొడ్డిగల్లు, రాజయ్యపేట, రమణయ్యపేట, బోయపాడు, డీఎల్పురం, ముకుందరాజుపేట, అయ్యన్నపాలెం, నక్కపల్లి పాఠశాలల్లో భవనాలు అసంపూర్తిగానే ఉన్నాయి. పెదబోదిగల్లం పాఠశాల భవనాలు పూర్తిగా శిథిలమయ్యాయి. అలాగే ఎస్.రాయవరం మండలం, కశింకోట మండలం, అనకాపల్లి మండలంలోని అనేక పాఠశాలల్లో భవన నిర్మాణాలు మధ్యలోనే నిలిచిపోయాయి.
జిల్లాలో పాఠశాలల వివరాలు
ప్రాథమిక – 1,152
ప్రాథమికోన్నత – 341
ఉన్నత – 431
మొత్తం పాఠశాలలు – 1,924
విద్యార్థుల సంఖ్య – 2,21,788
మొత్తం ఉపాధ్యాయులు – 10,412

మోగనుంది సమస్యల గంట

మోగనుంది సమస్యల గంట

మోగనుంది సమస్యల గంట