
మునగపాకలో తీరని విషాదం
మునగపాక: కుటుంబానికి పెద్ద దిక్కుగా నిలుస్తాడనుకున్న కుమారుడు ఫార్మా ప్రమాదంలో మృతి చెందడంతో మునగపాకలో విషాదం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. మునగపాక మధ్య వీధిలో నివాసం ఉంటున్న శరగడం కుమార్(25)కు గత సంవత్సర క్రితం వివాహం జరిగింది. కుమార్ 8 నెలల క్రితం పరవాడలోని ఎస్ఎస్ ఫార్మాలో సేప్టీ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తూ వచ్చాడు. ఈ నెల 11న రాత్రి విధి నిర్వహణలో ఉండగా వెలువడిన విష వాయువులను పీల్చడంతో కుమార్ అస్వస్థతకు గురవడంతో వెంటనే అతనిని విశాఖ కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ కుమార్ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మునగపాక గ్రామంలో విషాదం నెలకొంది. కుమార్ తండ్రి రామకృష్ణ గత 7 సంవత్సరాల క్రితం మృతి చెందగా తల్లి లక్ష్మి నాలుగు నెలల క్రితం చనిపోయింది. కుమార్ తమ్ముడు సౌత్ ఆఫ్రికాలో ఉద్యోగం చేస్తున్నాడు. భర్త కుమార్ మృతి చెందాడన్న విషయం తెలియడంతో భార్య మాధురి కన్నీటిపర్యంతమైంది. ఎంతో భవిష్యత్ ఉన్న కుమార్ ఫార్మా ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబానికి పెద్ద దిక్కు ఎవరంటూ ఆవేదన చెందుతున్నారు. అందరితో సఖ్యతగా ఉండే కుమార్ ఫార్మా ప్రమాదంలో మృతి చెందడాన్ని స్థానికులు, స్నేహితులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదిలా ఉండగా మృతుడు కుమార్ కుటుంబానికి న్యాయం చేయాలని కంపెనీ యాజమాన్యంతో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి బొడ్డేడ ప్రసాద్, కర్రి సాయికృష్ణ, పెంటకోట విజయ్ తదితరులు చర్చలు జరిపారు. కుమార్ అంత్యక్రియలు శనివారం మునగపాకలో నిర్వహించనున్నారు.

మునగపాకలో తీరని విషాదం