కూటమి పాలనలో ప్రజలకు ఒరిగింది శూన్యం | - | Sakshi
Sakshi News home page

కూటమి పాలనలో ప్రజలకు ఒరిగింది శూన్యం

Jun 14 2025 7:47 AM | Updated on Jun 14 2025 7:47 AM

కూటమి పాలనలో ప్రజలకు ఒరిగింది శూన్యం

కూటమి పాలనలో ప్రజలకు ఒరిగింది శూన్యం

సీపీఎం జిల్లా కార్యదర్శి కోటేశ్వరరావు ధ్వజం

అనకాపల్లి: కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో ప్రజలకు ఒరిగింది శూన్యమని సీపీఎం జిల్లా కార్యదర్శి జి.కోటేశ్వరరావు ధ్వజమెత్తారు. స్థానిక సీపీఎం కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పారిశ్రామిక, వ్యవసాయ, నీటిపారుదల రంగం, ఉపాధి కల్పన, విద్య, వైద్య రంగం, మౌలిక సదుపాయాల కల్పనలో సాధించిన అభివృద్దిని నియోజకవర్గాల వారీగా శ్వేతపత్రం విడుదల చేసి ప్రజలకు తెలియజేయాలన్నారు. భారీ పెట్టుబడులు, లక్షలాది మందికి ఉపాధి కల్పనపై ప్రకటనలు తప్ప ఏడాది పాలనలో జిల్లాకు కొత్తగా వచ్చిన పరిశ్రమలు కంటికి ఎక్కడా కనిపించడం లేదన్నారు. ఉన్న విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను దెబ్బతీసి నక్కపల్లి ప్రాంతంలో ప్రైవేట్‌ మిట్టల్‌ స్టీల్‌ను ప్రోత్సహించాలన్న కుట్ర తప్ప ప్రజలకు ఎక్కడా మేలు కనిపించడం లేదన్నారు. పరిశ్రమల్లో స్థానిక యువతకు 75 శాతం ఉద్యోగాలు కల్పించాలన్న జీవో బుట్టదాఖలైందన్నారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో ఓట్ల కోసం తుమ్మపాల, ఏటికొప్పాక, తాండవ సహకార సుగర్‌ ఫ్యాక్టరీలను తెరిపిస్తామని ఇచ్చిన మాట ఏడాది అవుతున్నా నిలబెట్టుకోలేదని విమర్శించారు. గోవాడ సుగర్‌ ఫ్యాక్టరీలో వచ్చే సీజన్‌ నాటికి క్రషింగ్‌ నిలిపివేసే కుట్రలో ప్రభుత్వం ఉందన్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, పోలవరం ఎడమ కాలువ పనులు ఎప్పటిలోగా పూర్తిచేసి అనకాపల్లి ప్రజలకు సాగునీటి సౌకర్యం కల్పిస్తారో స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్‌ చేశారు. తాండవ, పెద్దేరు, కోనాం, రైవాడ జలాశయాల ఆయకట్టును స్థిరీకరించేందుకు నిధులు విడుదల చేయకుండా, రైవాడ జలాశయం ఎగువ భాగాన పంప్డ్‌ స్టోరేజ్‌ పవర్‌ ప్రాజెక్టు నిర్మాణానికి అదానీకి కూటమి ప్రభుత్వం అనుమతి ఇచ్చి ఆయకట్టును దెబ్బతీసే చర్యలకు శ్రీకారం చుట్టిందన్నారు. మైదాన ప్రాంత గిరిజనులకు నర్సీపట్నం కేంద్రంగా ప్రత్యేక ఐటీడీఏ ఏర్పాటు చేయాలన్నారు. నక్కపల్లి సీహెచ్‌సీలో ట్రామా కేర్‌ సెంటర్‌, ఎన్టీఆర్‌ ప్రభుత్వాస్పత్రిలో సూపర్‌ స్పెషాల్టీ విభాగాలు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. పరిశ్రమల్లో తరచూ ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో మెరుగైన వైద్యం సకాలంలో అందించేలా ఎన్టీఆర్‌ ఆస్పత్రిని తీర్చిదిద్దాలన్నారు. తీర ప్రాంత మత్స్యకారుల జీవనోపాధి దెబ్బతినకుండా కాలుష్య పరిశ్రమల వ్యర్థాలను శుద్ధి చేసే వ్యవస్థను పటిష్టం చేయాలని కోరారు. వ్యర్థాలను శుద్ధి చేయకుండా సముద్రంలోకి నేరుగా విడిచిపెడుతున్న పరిశ్రమలపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలన్నారు. ప్రతిపాదిత పూడిమడక ఫిషింగ్‌ హార్బర్‌, నక్కపల్లి మండలం రాజయ్యపేట వద్ద ఫిష్‌ ల్యాండ్‌ సెంటర్‌ నిర్మాణం పనులను తక్షణమే చేపట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఎంపీ సీఎం రమేష్‌ ఏడాది పాలనలో జిల్లా అభివృద్ధికి చేసిన కృషి ఏమీలేదన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఆర్‌.శంకరరావు, గనిశెట్టి సత్యనారాయణ, గంటా శ్రీరామ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement