
స్ఫూర్తి ప్రదాత.. గణేష్
మునగపాక: మండలంలోని టి.సిరసపల్లికి చెందిన కొమ్మోజు గణేష్ రక్తదానాలతో ప్రాణదాతగా గుర్తింపు పొందారు. గణేష్ నిరంతర సేవా ఫౌండేషన్ స్థాపించి రక్తదాతలు, వలంటీర్ల సహకారంతో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో రక్తదాన శిబిరాలు నిర్వహిస్తూ ఎంతో మందికి ప్రాణదాతగా నిలుస్తున్నారు. అంతేకాకుండా 20 సార్లు రక్తదానం చేసి ఎంతో మందిలో స్ఫూర్తి నింపారు. సొంతంగా వైద్య శిబిరాలు కూడా తరచూ నిర్వహిస్తున్నారు.
కోవిడ్ విలయ తాండవంలో సైతం
కోవిడ్ విలయ తాండవంలో సైతం గణేష్ రోగుల అవసరాన్ని బట్టి స్నేహితుల సహకారంతో రక్తం, ప్లాస్మా దానం చేపట్టారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో 7 వేల మంది వలంటీర్ల సహకారంతో 40 వరకు రక్తదాన శిబిరాలు నిర్వహించారు. రక్తదాన శిబిరాలతో పాటు ఉచిత వైద్య శిబిరాలు, క్యాన్సర్ పరీక్ష శిబిరాలు సొంతంగా ఏర్పాటు చేశారు. ఈ సేవలకు గాను ప్రాణదాత సేవా పురస్కారాన్ని తెలంగాణా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ చేతుల మీదుగా గణేష్ అందుకున్నారు. అలాగే యంగ్ ఇండియన్ జాతీయ స్థాయి సేవా పురష్కారం కూడా దక్కించుకున్నారు.

స్ఫూర్తి ప్రదాత.. గణేష్