
సీఆర్ఎంటీలకు కలవరం
● వీరిని బోధన నుంచి దూరం చేస్తున్న విద్యాశాఖ ● 2012 నుంచి సేవలందిస్తున్న రిజర్వ్ మొబైల్ టీచర్లు ● క్లస్టర్ లెవెల్ అకడమిక్ టీచర్స్ విధానాన్ని ప్రోత్సహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
నర్సీపట్నం: రాష్ట్ర విద్యాశాఖ అధికారులు తీసుకుంటున్న నిర్ణయాలు సమగ్ర శిక్ష అభియాన్లో పనిచేస్తున్న క్లస్టర్ రిజర్వ్ మొబైల్ టీచర్లకు (సీఆర్ఎంటీలు) శాపంగా మారాయి. బదిలీలు, ప్రమోషన్లు చేయగా మిగిలిన ఉపాధ్యాయులను క్లస్టర్ లెవెల్ అకడమిక్ టీచర్లుగా వినియోగించుకునేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుండడంతో సీఆర్ఎంటీలు ఆందోళన చెందుతున్నారు. గత ప్రభుత్వం సీఆర్ఎంటీల సేవలకు పెద్దపీట వేసింది. 2012 నుంచి విధులు నిర్వర్తిస్తున్న వీరి సేవలను బోధనకు ఉపయోగించుకునేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం జీవో నెంబరు 65 ద్వారా క్లస్టర్ రిజర్వ్ మొబైల్ టీచర్ వ్యవస్థను తీసుకువచ్చింది. ఈ జీవో ప్రకారం సీఆర్పీ విధానం రద్దయి సీఆర్ఎంటీ విధానం ప్రస్తుతం అమల్లో ఉంది. అలా ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉన్న 260మంది సీఆర్ఎంటీలు టీచర్లు సెలవు పెడితే విద్యార్థులకు పాఠాలు బోధించేవారు. వీరు విద్యాశాఖలో ముఖ్య భూమిక పోషిస్తున్నారు. కూటమి ప్రభుత్వ సీఆర్ఎంటీలను ఇంటికి సాగనంపేందుకు పూనుకుందని, అందుకే బదిలీలు జరగగా మిగిలిన ఉపాధ్యాయులను తమ స్థానంలో నియమించేందుకు ప్రభుత్వం పావులు కదుపుతోందని సీఆర్ఎంటీలు ఆందోళన చెందుతున్నారు. తమ సేవలను మరింత వినియోగించుకోవాలని వారు కోరుతున్నారు.
ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలి..
ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. మా సేవలను మరింత వినియోగించుకోవాలి. ఉద్యోగ భద్రత కల్పించాలి. ప్రభుత్వ తీసుకొచ్చిన క్లస్టర్ లెవెల్ అకడమిక్ టీచర్ విధానాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జోక్యం చేసుకుని, రాష్ట్రంలో పనిచేస్తున్న 3,300 మంది సీఆర్ఎంటీలకు తగు న్యాయం చేయాలి
–పూడి వెంకట్రావు, ఏపీ సీఆర్ఎంటీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

సీఆర్ఎంటీలకు కలవరం