సమస్యల గంట | - | Sakshi
Sakshi News home page

సమస్యల గంట

Jun 13 2025 5:11 AM | Updated on Jun 13 2025 5:33 AM

బడిలో
తెరుచుకున్న పాఠశాలలు..అసౌకర్యాలతో స్వాగతం
● పాఠ్య పుస్తకాలతో సరి ● అరకొరగా స్టూడెంట్‌ కిట్‌ల పంపిణీ ● తొలి రోజు మూడొంతులు తగ్గిన విద్యార్థుల హాజరు శాతం ● విద్యార్థుల కోసం తల్లికి వందనం పేరిట హడావుడి

అనకాపల్లి టౌన్‌ గర్‌ల్స్‌ హైస్కూల్‌ ఆవరణలో నిలిచిపోయిన వర్షపు నీరు

అసంపూర్తిగా తరగతులు, టాయిలెట్ల నిర్మాణాలు

కొన్ని స్కూళ్లలో తరగతి భవనాలు, టాయిలెట్ల నిర్మాణాలు అసంపూర్తిగా నిలిచి దర్శనమిచ్చాయి. మరికొన్ని చోట్ల స్కూళ్ల ఆవరణలో ఆటస్థలాల్లో తుప్పలు, చెత్త చెదారం పేరుకుపోయాయి. జిల్లా విద్యాశాఖ ఉన్నతాధికారి ఎస్‌జీటీ కౌన్సెలింగ్‌లో మూడు రోజులుగా బిజిబిజీగా ఉన్నారు. జిల్లా ఉన్నతాధికారుల నుంచి ప్రజా ప్రతినిధులు వరకూ యోగా వేడుకల్లో ఉండడంతో తొలిరోజు స్కూళ్లు మొక్కుబడిగా నడిచాయి. మాడుగుల మండలంలో ఎం.కోడూరు జిల్లా పరిషత్‌ హైస్కూల్లో ఒకే ఒక్క విద్యార్థి కొత్తగా చేరారు.

సాక్షి, అనకాపల్లి: ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలన్నీ గురువారం తెరుచుకొన్నాయి. ప్రారంభం రోజునే వి ద్యార్థులకు కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అసౌకర్యా లు స్వాగతం పలికాయి. విద్యార్థుల నమోదు శాతం గణనీయంగా తగ్గింది. మూడొంతుల హాజరు శాతం తగ్గుముఖం పట్టింది. కొత్త విద్యార్థుల చేరిక అరకొరగానే జరిగింది. ‘తల్లికి వందనం’ ఇచ్చేస్తున్నామని కూటమి ప్రభుత్వం హడావుడి చేసి విద్యార్థులను పాఠశాలలకు రప్పించే ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం ఇవ్వలేదు. పాఠశాలల ప్రారంభమైన తొలి రోజు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు వి ద్యార్థుల హాజరు గణనీయంగా తగ్గిపోవడంతో వి ద్యార్థులు మళ్లీ ప్రైవేట్‌ స్కూళ్ల వైపు మరలుతున్న ఛా యలు కనిపిస్తున్నాయి. అసౌకర్యాలు నిండిన ప్రభు త్వ పాఠశాలల్లో రెక్కలు విరిగిపోయిన ఫ్యాన్లు, పాఠశాల ఆవరణలో బురద, నిల్వ ఉన్న వర్షం నీరుతో విద్యార్థులకు సమస్యలు స్వాగతం పలికాయి.

అరకొరగా స్టూడెంట్‌ కిట్లు...

జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో తొలి రోజు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. గాజువాకలో గల బుక్‌ డిపో నుంచి అనకాపల్లి జిల్లాలోగల వివిధ ప్రభుత్వ పాఠశాలలకు తరలించారు. జిల్లాలో మొత్తం 5,13,887 పుస్తకాలు అవసరం ఉంది. వంద శాతం 5,13,887 పాఠ్యపుస్తకాలు సరఫరా చేశారు. అయితే స్టూడెంట్‌ కిట్‌లో యూనిఫాం, బ్యాగ్‌లు సగం మాత్రమే వచ్చాయి. వచ్చిన సగం కూడా ఎవరికీ ఇవ్వలేదు. టై, బెల్టు, షూ రానేలేదు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో పాఠశాలలు తెరిచిన రోజునే జగనన్న విద్యాకానుక (స్టూడెంట్‌ కిట్‌) ద్వారా విద్యార్థులకు అవసరమైన పాఠ్యపుస్తకాలు, యూనిఫాం, టై, బెల్టు, షూ తదితర సామగ్రి అందజేస్తూ వచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత నుంచి గతేడాది అరకొరగానే కిట్లు పంపిణీ చేసినా..ఈ ఏడాదైనా పూర్తిస్థాయిలో ఇస్తారేమో అని విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు పెట్టుకున్న ఆశ నిరాశగానే మిగిలిపోయింది.గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ప్రతి ఏటా ఒక్కో విద్యార్థికి అమ్మ ఒడి పధకం కింద రూ, 15 వేలు నగదు అందేది. కూటమి ప్రభుత్వం వచ్చిన తరవాత తల్లికి వందనం ఎంత మంది విద్యార్థులుంటే అంత మందికి ఏడాదికి రూ. 15 వేలు అందిస్తామన్నా గత ఏడాది ఒక్కరికీ ఇవ్వలేదు.

తొలి రోజు 39 శాతం హాజరు..

పాయకరావుపేట నియోజకవర్గంలో నక్కపల్లి మండలంలో 7,584 మంది విద్యార్థులకు గానూ 1936 మంది హాజరయ్యారు. ఎస్‌.రాయవరం మండలంలో 7704 మంది విద్యార్థులకు 2767 మంది విద్యార్థులు హాజరయ్యారు. పాయకరావుపేట మండలంలో 4562 మంది విద్యార్థులకు 1070 మంది హాజరయ్యారు.

చోడవరం నియోజకవర్గం బుచ్చెయ్యపేట మండలంలో 3,714 మంది విద్యార్థులకు 1308 మంది, రోలుగుంట మండల పరిధిలో 2387 మంది విద్యార్థులకు 1910 మంది, అలాగే చోడవరం మండల పరిధిలో 4542 మంది విద్యార్థులు, రావికమతం మండల పరిధిలో 5230 మంది విద్యార్థులు హాజరయ్యారు.

యలమంచిలి నియోజకవర్గం మునగపాక మండల పరిధిలో గల ప్రభుత్వ స్కూళ్లలో 5184 మంది విద్యార్థులకు 4092 మంది హాజరయ్యారు

యలమంచిలి మండల పరిధిలో 3,916 మందికి 2,867 మంది, రాంబిల్లి మండల పరిఽధిలో సుమారుగా 2,300 మంది, అచ్యుతాపురం మండల పరిధిలో 4,000 మంది హాజరయ్యారు.

నర్సీపట్నం నియోజకవర్గంలో మాకవరపాలెం మండలంలో 2904 మంది విద్యార్థులకు 2576 మంది, నర్సీపట్నం మండల రూరల్‌, టౌన్‌ పరిధిలో 19 వేల మందికి 1700 మంది, గొలుగొండ మండల పరిధిలో 4024 మందికి 1100 మంది విద్యార్థులు, నాతవరం 4,900 మంది విద్యార్థులకు 2,500 మంది వరకూ హాజరయ్యారు.

అనకాపల్లి నియోజకవర్గంలో అనకాపల్లి మండల రూరల్‌, టౌన్‌ పరిధిలో 9 వేల మంది విద్యార్థులకు 5 వేల మంది, కశింకోట మండల పరిధిలో 3800 మందికి 1400 మంది హాజరయ్యారు.

మాడుగుల నియోజకవర్గం మాడుగుల మండల పరిధిలో 5,212 మందికి 4,800 మంది, దేవరాపల్లి మండలం 4,308మందికి 3,366, కె.కోటపాడు మండల పరిధిలో 2343 మందికి 1205 మంది విద్యార్థులు హాజరవగా, చీడికాడ మండల పరిధిలో 1525 మంది విద్యార్థులు హాజరయ్యారు.

సబ్బవరం మండలంలో 2,556 మందికి, 1989, పరవాడ మండలంలో 3,466 మందికి 1075 మంది హాజరయ్యారు.

సమస్యల గంట1
1/3

సమస్యల గంట

సమస్యల గంట2
2/3

సమస్యల గంట

సమస్యల గంట3
3/3

సమస్యల గంట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement