
బాలికా సాధికారతకు పెద్దపీట
పరవాడ: బాలికా సాధికారతకు సింహాద్రి ఎన్టీపీసీ సీఎస్సా ర్ విభాగం తీసుకున్న చొరవ అభినందనీయమని అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ అన్నారు. ఈ విభాగం ఆధ్వర్యంలో గత నెల 9న ప్రారంభమైన బాలికా సాధికారత మిషన్–2025 వర్క్షాపు శనివారంతో ముగిసింది. ఈ సందర్భంగా ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ ఆడపిల్లలకు విద్య నేర్పించడం ఎంత అవసరమో వివరించారు. బాలికల వ్యక్తిత్వంపై దృష్టి పెట్టాలని సూచించారు. ఎన్టీపీసీ కార్పొరేట్ ప్లానింగ్ ఈడీ సంగీత కౌశిక్ మాట్లాడుతూ బాలికల అభ్యున్నతే లక్ష్యంగా పని చేస్తున్న సంస్థ చొరవను కొనియాడారు. సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సమీర్ శర్మ మాట్లాడుతూ గర్ల్ ఎంపవర్మెంట్ మిషన్ ద్వారా బాల బాలికలకు యోగా, కరాటే, కంప్యూటర్, నృత్యం, స్పోకెన్ ఇంగ్లిష్, వ్యక్తిత్వ వికాసం, చిత్రలేఖనం తదితర అంశాల్లో నిపుణులతో ప్రత్యేక శిక్షణ ఇప్పించామన్నారు. వర్క్షాప్లో పాల్గొన్న 120 మంది బాలికలకు అవసరమైన సదుపాయాలను కల్పించడం కోసం సంస్థ రూ.50 లక్షలను వెచ్చిందన్నారు. ఈ మిషన్లో బాలికలకు మార్గదర్శకాలను అందించిన ఉద్యోగులను ఈడీ అభినందించారు. కార్యక్రమంలో బాలికల నృత్యాలు, ఆపరేషన్ సిందూర్, యోగా, కరాటే వంటి ప్రదర్శనలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో సంస్థ ఉన్నతాధికారులు, అధికారులు పాల్గొన్నారు.
120 మంది బాలికలకు వివిధ రంగాల్లో శిక్షణ
ఎన్టీపీసీ కృషి అభినందనీయం:
కలెక్టర్ విజయ కృష్ణన్