
పరీక్ష నేల చూపులు
హిమ సొగసు
మన్యంలోని పాడేరు ఘాట్, హుకుంపేట, జి.మాడుగుల ప్రాంతాల్లో కొద్దిరోజులుగా పొగమంచు దట్టంగా కురుస్తోంది. వేసవిలోను కమ్ముకున్న మంచు తెరలు చూపరులకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. పగటి పూట ఎండ, రాత్రి చలిగాలులు ఉండటం వల్ల ఉదయం వేళల్లో మంచుతో కూడిన ప్రకృతి అందాలు ఆకట్టుకుంటున్నాయి. – సాక్షి, పాడేరు
అవగాహన లేక నష్టపోతున్నాం
భూసార పరీక్షలపై చాలామంది రైతులకు అవగాహన లేదు. మట్టిలో పోషకాల గురించి తెలియక అధిక మోతాదులో ఎరువులు వాడి నష్టపోతున్నాం. వ్యవసాయశాఖ అధికారులు ఈ సీజన్లో గ్రామ సభలు పెట్టి రైతులను భూసార పరీక్షలపై చైతన్యవంతం చేయాలి. భూసార పరీక్షల ఆధారంగా ఎరువులు, మందులు వాడాలన్న అవగాహన రైతులకు కల్పించాలి.
–పోలిరెడ్డి రమణ, రైతు, పురుషోత్తపురం
నా పొలంలో మట్టి నమూనా తీయలేదు
ఇప్పటివరకు నా పొలంలో మట్టి నమూనా తీయలేదు. ఖరీఫ్ సాగు సమయం ఆసన్నమైనా మట్టి నమూనా సేకరించకపోతే ఇంకెప్పుడు భూసార ఫలితాలు రైతులకు తెలుస్తాయో వ్యవసాయాధికారులే చెప్పాలి. భూసార పరీక్షల ఫలితాలు సకాలంలో రైతులకు అందజేస్తే రైతులకు పెట్టుబడి వ్యయం తగ్గడంతోపాటు అధిక దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది.
–యల్లపు శ్రీనివాసరావు, రైతు,
సోమలింగపాలెం, యలమంచిలి
యలమంచిలి రూరల్: పంటల సాగులో నేల స్వభావం కీలక పాత్ర పోషిస్తుంది. మట్టిలో తగిన పోషకాలుంటేనే అధిక దిగుబడులు సాధ్యమవుతాయి. ఇందుకోసం భూసార పరీక్షలు చేయించి వ్యవసాయాధికారులు, శాస్త్రవేత్తల సూచనలు, సలహాలు పాటిస్తూ సాగు చేస్తే మంచి ఫలితాలు సాధించవచ్చు. నేల సారవంతానికి తగ్గట్టుగా ఎరువులు వాడితే మంచి దిగుబడులు పొందవచ్చు. ఇందుకు నేలలో సరైన పోషకాలు ఉన్నాయా? లేకుంటే ఎంత మోతాదులో ఎరువులు వాడాలి.. వంటి వివరాలు తప్పనిసరిగా రైతులు తెలుసుకోవాలి. కానీ జిల్లాలో భూసార పరీక్షలకు అవసరమైన మట్టి నమూనాల సేకరణ లక్ష్యానికి దూరంగా సా..గుతోంది. మట్టి నమూనాల సేకరణకు ఖరీఫ్ సీజన్ అనుకూలంగా ఉంటుంది. ఈ సీజన్కు ముందే వ్యవసాయ శాఖ అధికారులు మట్టి నమూనాల కోసం మండలాలవారీగా లక్ష్యాలను నిర్దేశించారు.
రెండుసార్లు గడువు పొడిగించినా..
జిల్లాలో 24 మండలాల్లో 450 రైతు సేవా కేంద్రాల్లో ఈ ఏడాది 25,052 మట్టి నమూనాల సేకరణను లక్ష్యంగా పెట్టుకోగా ఆశించిన స్థాయిలో సేకరణ జరగలేదు. దీంతో ఇప్పటివరకు రెండుసార్లు గడువు పొడిగించినా ఇప్పటివరకు 84.62 శాతం (21,441) మాత్రమే మట్టి నమూనాలను తీశారు. నర్సీపట్నం, రోలుగుంట, సబ్బవరం మండలాల్లో మాత్రమే మట్టి నమూనాల లక్ష్యం పూర్తి చేశారు. పరవాడ, కశింకోట, బుచ్చెయ్యపేట, రాంబిల్లి, చోడవరం, మునగపాక, చీడికాడ మండలాల్లో 90 శాతానికి పైగా పూర్తయ్యాయి. మిగిలిన మండలాల్లో మట్టి నమూనాల సేకరణపై సిబ్బంది నిర్లక్ష్యం చూపుతున్నారు. పాయకరావుపేట, నాతవరం, మాకవరపాలెం మండలాలు మట్టి నమూనాల సేకరణ గణాంకాల్లో అట్టడుగున ఉన్నాయి. మట్టి నమూనాల సేకరణే ఇంకా పూర్తి చేయకపోవడంతో వాటి విశ్లేషణ పూర్తి చేసి రైతులకు నివేదికల కార్డులను సకాలంలో అందజేయడం సాధ్యమేనా అనే సందేహం కలుగుతోంది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదలడంతో ఇప్పటికే ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జిల్లాలో కొన్నిచోట్ల వానాకాలం సాగు కోసం రైతులు దుక్కులు దున్నుతున్నారు. మట్టి నమూనాల సేకరణకు ఈ నెల 15 వరకు గడువు పొడిగించారు. ఈ నేపథ్యంలో సేకరిస్తున్న మట్టి నమూనాల ఫలితాలు సకాలంలో అందుతాయో? లేదోనన్న ఆందోళన రైతుల్లో నెలకొంది.
మట్టి నమూనాల సేకరణ లక్ష్యం 25,052
సేకరించిన నమూనాలు 21,441
ఖరీఫ్ సమీపిస్తున్నా కొలిక్కిరానిభూసార ఫలితాలు
రెండుసార్లు గడువు పొడిగించినా సా..గుతున్న మట్టి నమూనాల సేకరణ
ఫలితాలు వస్తేనే రైతులకు ప్రయోజనం
ఇప్పటివరకు 84.62 శాతం మట్టి నమూనాల సేకరణ
మట్టి సేకరణ ఇలా..
ఎంచుకున్న 2.5 ఎకరాల పొలంలో ఒక మూల నుంచి మూడు అడుగుల దూరాన్ని వదిలిపెట్టి ‘వి’ ఆకారంలో ఆరు అంగుళాల గుంత తీసి అడుగు నుంచి మూలల వైపు మట్టిని సేకరించాలి. ఇదే విధానంలో 10 నుంచి 20 చోట్ల జిగ్జాగ్గా మట్టిని గోనెసంచిపై వేసి బాగా కలపాలి. ఆ మట్టిని నాలుగు భాగాలుగా విభజిస్తారు. ఎదురెదురుగా ఉన్న భాగాలు తీసుకుని. మిగిలిన భాగాన్ని వదిలేస్తారు. ఇలా అర కిలో మట్టి నమూనాను తీసుకుని అనకాపల్లిలో ఉన్న భూసార పరీక్ష కేంద్రానికి పంపిస్తారు. మట్టి పరీక్షల అనంతరం సేంద్రీయ కర్బనం, నత్రజని, భాస్వరం, పొటాషియం, జింక్, కాల్షియం వంటి పోషకాలు భూమిలో ఎంత మోతాదులో ఉన్నాయో తెలుస్తుంది. రెండేళ్లకోసారి నిర్వహించే భూసార పరీక్షల ద్వారా నేలలో పోషకాలను బట్టి అధికారుల సూచనల మేరకు ఎరువులు, మందులు ఏ మోతాదులో వేయాలో తెలుస్తుంది. విచ్చలవిడిగా రసాయన ఎరువుల వినియోగాన్ని, అదనపు ఖర్చును తగ్గించవచ్చు. రైతు సేవా కేంద్రాల సిబ్బంది సేకరిస్తున్న మట్టి నమూనాలకు భూసార పరీక్ష కేంద్రంలో 12 రకాల పరీక్షలు నిర్వహిస్తారు. ఫలితాలను ఎస్హెచ్సి పోర్టల్లో పొందుపరుస్తున్నారు. ఫలితాలను రైతు మొబైల్ఫోన్కు తెలుగులో సంక్షిప్త సందేశం పంపేలా సాఫ్ట్వేర్ను రూపొందించారు. ఫలితాల విశ్లేషణ పత్రాలను కూడా రైతులకు కార్డుల రూపంలో అందజేస్తారు. పొలంలో ఉన్న పోషక స్థాయిలకు అనుగుణంగా ఎరువులను సూచిస్తారు. ఈ ప్రక్రియ అంతా ఖరీఫ్ సాగు ప్రారంభానికి ముందే పూర్తయితే రైతులకు ప్రయోజనకరంగా ఉంటుంది. సాగుకు ముందుగానే భూసార ఫలితాలు వచ్చేలా అధికారులు చొరవ తీసుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు.

పరీక్ష నేల చూపులు

పరీక్ష నేల చూపులు

పరీక్ష నేల చూపులు