
యంత్రాలతో పనులు.. సిమెంట్ కాలువలకు ముప్పు.!
వైఎస్సార్ హయాంలో కాలువలకు సిమెంట్ లైనింగ్
దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో తాండవ కాలువలకు సిమెంట్ లైనింగ్ పనులు చేపట్టారు. మొదట విడతలో రూ.55 కోట్లు మంజూరు చేయగా.. చాలకపోవడంతో మళ్లీ రూ.10 కోట్లు ఇచ్చారు. కాలువలకు సిమెంట్ లైనింగ్ చేయడంతో శివారు ఆయకట్టుకు సైతం నీరు పుష్కలంగా ప్రవహించేది.
నాతవరం: తాండవ కాలువలో పూడికతీత పనులు పొక్లెయిన్తో చేపట్టడం వల్ల సిమెంట్ లైనింగ్ దెబ్బతింటోంది. ఉపాధి హామీ పథకం పనులు కూలీలతోనే చేపట్టాలన్న నిబంధనలను సైతం బేఖాతరు చేస్తున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలోనే మేజరు ప్రాజెక్టు తాండవ రిజర్వాయరు. అనకాపల్లి జిల్లాలో రెండు నియోజకవర్గాలు, కాకినాడ జిల్లాలో రెండు నియోజకవర్గాల పరిధిలో మేజరు, మైనరు కాలువ కలుపుకొని సుమారుగా 120 కిలోమీటర్ల పొడవున సాగునీరు ఆయకట్టుకు ప్రవహిస్తుంది. ఈ ఏడాది తాండవ కాలువలో పూడికతీత పనులను రూ.60 లక్షల ఇరిగేషన్ నిధులతో, రూ.1.50 కోట్ల ఉపాధి హామీ పథకం నిధులతో చేపడుతున్నారు. ఉపాధి హామీ పథకం నిధులతో అయితే కూలీలతోనే పనులు చేయించాలి. ఇరిగేషన్ నిధులతో అయితే అధిక శాతం యంత్రాలతో చేస్తున్నారు. పొక్లెయిన్ను తాండవ కాలువలోకి దించి పూడికతీత పనులు చేపట్టడం వల్ల సిమెంట్ లైనింగ్ పెచ్చులూడి పోతుంది. పొక్లెయిన్ ఐరన్ పళ్లతో పూడిక తొలగించడంతో పూడిక తొలగింపు మాట ఎలా ఉన్నా అధిక శాతం సిమెంట్ లైనింగ్ ధ్వంసం అవుతుందని ఆయకట్టుదారులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. పూడిక తీసిన మట్టిని గట్టు దరిదాటని విధంగా వేస్తుండడంతో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు మళ్లీ కాలువలోకే జారిపోతున్న పరిస్థితులు నెలకొన్నాయి. కూలీలతో పనులు చేయించితే సిమెంట్ లైనింగ్కు ఎలాంటి దెబ్బ తగలకుండా ఉంటుంది. అయితే కూలీలతో పూడిక పసులు చేపడితే ఖర్చు ఎక్కువ.. పని కాస్తా ఆలస్యంగా జరుగుతుంది. దీన్ని గమనించిన కాంట్రాక్టర్లు అధిక మొత్తంలో డబ్బులు మిగులుతాయన్న ఉద్దేశంతో యంత్రాలతో పనులు కానిచ్చేస్తున్నారు. పూడికతీత పనులు అధికంగా కూటమి నేతల కనుసన్నల్లో జరుగుతున్నాయి. ఇటీవల జరిగిన నీటి సంఘాల ఎన్నికలు ప్రాజెక్టు కమిటీ చైర్మన్, డీసీ మెంబర్లతో పాటు కమిటీ సభ్యులు నీటి సంఘాల అధ్యక్షులు అంతా కూటమి నేతలే ఉన్నారు. దీంతో ఆయా కూటమి పెద్దలను మచ్చిక చేసుకుని పూడిక తీత పనులు ఎలా చేసినా ఏం ఫర్వాలేదన్న విధంగా చేస్తున్నారన్న బహిరంగ విమర్శలు వినిపిస్తున్నాయి. కూటమి నేతలకు భయపడి అధికారులు సైతం చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. మండలంలో ఇంత వరకు పూడిక తీసిన కాలువలో పనులు పరిశీలిస్తే వాస్తవ పరిస్థితులు వెలుగులోకి వస్తాయి. ఇప్పటికై నా అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పనులు నిబంధనల ప్రకారం బాధ్యతగా చేయించాలని రైతులు కోరుతున్నారు.
స్పీకర్ అయ్యన్న ఆదేశాలు బేఖాతరు
ఇటీవల మండలంలో పర్యటనకు వచ్చిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు తాండవ కాలువ పూడికతీత పనులు ప్రధాన గేట్లు మరమ్మతు విషయంలో నిబంధనలు పాటించి నాణ్యతగా వేగవంతంగా చేయాలన్నారు. ఎవరైనా నాణ్యత పాటించకుండా పనులు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. అయినా అధికారులు పొక్లెయిన్తో పనులు చేస్తున్నారు. ఈ విషయంపై తాండవ ప్రాజెక్టు డీఈ అనురాధను సంప్రదించగా.. పొక్లెయిన్తో కాకుండా మనుషులతో పూడికతీత పనులు చేస్తామన్నారు. తాను స్వయంగా ఆయా పనులు పర్యవేక్షించి ఎలాంటి సమస్య లేకుండా చేస్తానన్నారు. కొన్ని చోట్ల మద్యం సీసాలు ధ్వంసం చేశారని, అవి గుచ్చుకుంటాయ,ని అలాంటి చోట మాత్రమే యంత్రాలతో పనులు చేపడుతున్నామన్నారు.
తాండవ కాలువ పనుల్లో అవకతవకలు
దెబ్బతింటున్న కాలువ సిమెంట్ లైనింగ్
గట్టు దరిదాటని విధంగా వేస్తున్న పూడికతీత మట్టి
వర్షాలకు మళ్లీ కాలువలోకే
జారిపోతున్న వైనం
కూటమి నేతల కనుసన్నల్లో పనులు

యంత్రాలతో పనులు.. సిమెంట్ కాలువలకు ముప్పు.!