మైక్‌తో దాడికి యత్నం | - | Sakshi
Sakshi News home page

మైక్‌తో దాడికి యత్నం

May 30 2025 1:29 AM | Updated on May 30 2025 1:29 AM

మైక్‌

మైక్‌తో దాడికి యత్నం

నర్సీపట్నం: మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశంలో టీడీపీ కౌన్సిలర్‌ ధనిమిరెడ్డి మధు ఆవేశంతో వైస్‌ చైర్మన్‌ కోనేటి రామకృష్ణపై మైకుతో దాడికి యత్నించడం కలకలం రేపింది. మున్సిపాలిటీ అభివృద్ధిపై చర్చకు సిద్ధమంటూ టీడీపీ, వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు విమర్శలు, ప్రతి విమర్శలతో చాలెంజ్‌ చేసుకున్నారు. వైఎస్సార్‌సీపీకి చెందిన వైస్‌ చైర్మన్‌ రామకృష్ణ, కౌన్సిలర్‌ ధనిమిరెడ్డి మధు మధ్య మాట మాట పెరిగి, పరిస్థితి అదుపు తప్పింది. టీడీపీ కౌన్సిలర్‌ మధు మైక్‌తో వైస్‌ చైర్మన్‌ రామకృష్ణపైకి దాడికి యత్నించారు. దీంతో సమావేశంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. మైక్‌తో పదే పదే దూసుకు వచ్చిన టీడీపీ కౌన్సిలర్‌ మధును వైఎస్సార్‌సీపీ, టీడీపీ కౌన్సిలర్లు, అధికారులు అదుపు చేశారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బోడపాటి సుబ్బలక్ష్మి అధ్యక్షతన మున్సిపల్‌ సర్వసభ్య సమావేశం గురువారం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పది నెలల కాలంలో స్పీకర్‌ సిహెచ్‌.అయ్యన్నపాత్రుడు సహకారంతో కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, గత ప్రభుత్వంలో పైసా పని జరగలేదని టీడీపీ కౌన్సిలర్‌ సిహెచ్‌.పద్మావతి అన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్‌ గణేష్‌ రూ.25 కోట్లతో మున్సిపాలిటీని అభివృద్ధి చేశారని చైర్‌పర్సన్‌, వైస్‌చైర్మన్‌ రామకృష్ణ బదులిచ్చారు. వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉన్నది ఐదేళ్లే, మీ కుటుంబానికి ప్రజలు ముప్పేళ్లకు పైగా అధికారం ఇస్తే ఇంకా రోడ్లు వేస్తున్నాం, డ్రైనేజీలు కడుతున్నామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని వైస్‌ చైర్మన్‌ రామకృష్ణ అన్నారు. దీంతో టీడీపీ కౌన్సిలర్‌ మధు, వైస్‌ చైర్మన్‌ రామకృష్ణ మధ్య మాటా మాటా పెరిగింది. టీడీపీ కౌన్సిలర్‌ మైక్‌తో దాడికి యత్నించారు. కౌన్సిలర్లు, అధికారులు సమయస్ఫూర్తితో వ్యవహరించకపోతే అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మరింత కొట్లాట జరిగేది. టౌన్‌ సీఐ గోవిందరావు సిబ్బందితో రంగప్రవేశఽం చేయడంతో వివాదం సద్దుమణిగింది.

సుజల స్రవంతి వాటర్‌ ప్లాంట్‌ నిర్వాహకులను మార్చడం సరికాదు

అజెండాలోని పదో అంశంపై వైస్‌ చైర్మన్‌ రామకృష్ణ, మాకిరెడ్డి బుల్లిదొర, మరో వైస్‌ చైర్మన్‌ తమరాన అప్పలనాయుడు అభ్యంతరం వ్యక్తం చేశారు. కేవలం రాజకీయ కక్షతో సుజల స్రవంతి వాటర్‌ ప్లాంట్‌ నిర్వాహకులను మార్చడం సరికాదని కమిషనర్‌ సురేంద్రను నిలదీశారు. వాటర్‌ ప్లాంట్‌ నిర్వహణకు ఎలాంటి అగ్రిమెంట్‌ లేన్నందున స్వయం సహాయక సభ్యులకు నిర్వహణ బాధ్యత అప్పగిస్తున్నామని కమిషనర్‌ బదులిచ్చారు. సుజల స్రవంతి వాటర్‌ ప్లాంట్లను అందుబాటులోకి తెచ్చింది టీడీపీ, అప్పుడు ఉన్న అధికారులే ఇప్పుడు ఉన్నారు, అగ్రిమెంట్‌ లేకుండా ఎలా ఇచ్చారని వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు నిలదీశారు. వారికి కనీసం నోటీసు ఇవ్వకుండా తొలగించటం సరికాదని వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. చైర్‌పర్సన్‌ కల్పించుకుని మరోసారి ఆలోచించి నిర్ణయం తీసుకుందామని, ఈ అంశాన్ని పక్కన పెట్టాలని అధికారులకు సూచించారు. కౌన్సిలర్లు సౌజన్య, రామరాజు తమ వార్డుల్లోని సమస్యలను ప్రస్తావించారు.

మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌పై టీడీపీ కౌన్సిలర్‌ దౌర్జన్యం

వైఎస్సార్‌సీపీ, టీడీపీ సభ్యుల మధ్య వాగ్వాదం

పోలీసుల రంగ ప్రవేశంతో సద్దుమణిగిన వివాదం

మైక్‌తో దాడికి యత్నం 1
1/1

మైక్‌తో దాడికి యత్నం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement