అక్రమాలు కనిపించవు... గోడు వినిపించదు...!! | - | Sakshi
Sakshi News home page

అక్రమాలు కనిపించవు... గోడు వినిపించదు...!!

May 28 2025 11:38 AM | Updated on May 28 2025 11:38 AM

అక్రమాలు కనిపించవు... గోడు వినిపించదు...!!

అక్రమాలు కనిపించవు... గోడు వినిపించదు...!!

బమ్మిడికలొద్దులో ఆగని లేటరైట్‌ తవ్వకాలు

నాతవరం : అక్రమాలు చూడం...జనం గోడు వినం...సమస్యలపై మాట్లాడం... అన్నట్టుగా ఉంది అధికారుల శైలి. గిరిజన ప్రాంతంలో జరుగుతున్న లేటరైట్‌ అక్రమ తవ్వకాలపై, గిరిజన సమస్యలపై స్వయంగా కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లినా స్పందించకపోవడంపై అధికారులపై ఉన్న నమ్మకం ప్రజల్లో సన్నగిల్లుతోంది. నాతవరం మండలంలో సుందరకోట పంచాయతీ శివారు బమ్మిడికలొద్దు గ్రామంలో లేటరైట్‌ తవ్వకాలు కూటమి పెద్దలు కనుసన్నల్లో జరుగుతోంది. ఇక్కడ లేటరైట్‌ తవ్వకాలు చేయడం వలన ఈ ప్రాంత గిరిజనులకు జరుగుతున్న ఇబ్బందులపై గత నెలలో నర్సీపట్నంలో కలెక్టర్‌ విజయ కృష్ణన్‌ నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌ వేదికలో స్వయంగా మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్‌ గణేష్‌ ఫిర్యాదు చేశారు. మాజీ ఎమ్మెల్యే ఇచ్చిన ఫిర్యాదుపై నేటి వరకు ఎలాంటి స్పందన లేదు, నిబంధనలు ఉల్లంఘించి కళ్ల ముందే కోట్లాది రూపాయలు విలువ చేసే ప్రకృతి సంపద కూటమి పెద్దలు కన్నుసన్నల్లో తరలించుకుపోతుంటే అధికారులు పట్టనట్టుగా ఉండిపోయారు. కనీసం అక్కడ ఏం జరుగుతుందో క్షేత్ర స్థాయిలో పరిశీలించేందుకు ఏ అధికారి వెళ్లిన దాఖలాలు లేవు. గిరిజనుల డిమాండ్‌ మేరకు మరలా ఈనెల 26వ తేదీన మాజీ ఎమ్మెల్యే ఉమా శంకర్‌ గణేష్‌ గిరిజన పెద్దలతో కలిసి అనకాపల్లి పీజీఆర్‌ఎస్‌లో కలెక్టర్‌కు లేటరైట్‌ అక్రమ తవ్వకాలపై స్వయంగా ఫిర్యాదు చేశారు. మాజీ ఎమ్మెల్యే ఇచ్చిన ఫిర్యాదుకే దిక్కు లేకపోతే సామాన్య ప్రజలు పీజీఆర్‌ఎస్‌లో ఇచ్చిన ఫిర్యాదుల పట్ల కూటమి ప్రభుత్వంలో ఏవిధంగా న్యాయం జరుగుతుందోనన్న సందేహాలుప్రజల్లో కలుగుతున్నాయి.

గిరి రైతులకు పట్టాలు..

పట్టించుకోని అధికారులు

మన్యంవాసులు ఎదుర్కొంటున్న కష్టాలు ఎప్పటికీ తీరడం లేదు. ఫిబ్రవరిలో కలెక్టర్‌ విజయ కృష్ణన్‌ సుందరకోట పంచాయతీ శివారు కొత్త దద్దుగుల గ్రామంలో గల గ్యాప్‌ ఏరియా భూముల పరిశీలనకు వచ్చారు. అప్పుడు స్ధానిక గిరిజన పెద్దగా ఎంపీపీ సాగిన లక్ష్మణమూర్తి గ్యాప్‌ ఏరియా భూములను ఏళ్ల తరబడి గిరిజనులు సాగు చేసుకుని జీవనం సాగిస్తున్నారని, వారందరికీ పట్టాలు ఇవ్వాలని కలెక్టర్‌కు విజ్ఙప్తి చేశారు. అలాగే సంక్షేమ పథకాలు తీసుకోవడానికి ఆన్‌లైన్‌ సమస్య ఉందని, సెల్‌ టవర్లు కొండలపై గ్రామాల్లో ఏర్పాటు చేయాలని కోరారు. అయితే ఇప్పటి వరకూ గిరిజనుల సమస్యలపై ఎటువంటి చర్యలు చేపట్టలేదు.

స్పీకర్‌ దృష్టికి తీసుకెళ్లినా మోక్షం లేదు

గత ఏడాది డిసెంబరు 24న సుందరకోట గ్రామానికి స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు వచ్చారు. అక్కడ నిర్వహించిన సభలో ఆయన దృష్టికి ఎంపీపీ సాగిన లక్ష్మణమూర్తి గిరిజన సమస్యలు తీసుకెళ్లారు. గత ప్రభుత్వంలో సరుగుడు, సుందరకోట పంచాయతీల శివారులోని 16 గిరిజన గ్రామాల్లో పోడు భూమి వ్యవసాయం చేసుకునే 550 మందికి అప్పటి ఎమ్మెల్యే ఉమాశంకర్‌ గణేష్‌ ఆధ్వర్యంలో పట్టాలు పాసుపుస్తకాలు పంపిణీ చేశామని, అర్హత ఉన్న మరో 250 మంది గిరిజనులకు పట్టాలు తయారు చేసినా ఎన్నికల కోడ్‌ కారణంగా ఆగిపోయాయన్నారు. వాటితోపాటు ఇంకా అర్హత ఉన్న గిరిజనులు సాగు చేసే భూముల గురించి సర్వే చేసి పట్టాలు ఇవ్వాలని స్పీకర్‌ను కోరారు. అయితే నెలలు గడిచినా ఇంతవరకూ ఒక్కరికై నా పట్టాలు ఇవ్వలేదు. వైఎస్సార్‌సీపీ హయంలో పట్టాలు పొందిన గిరిజనులందరూ రైతు భరోసా ఆర్థిక సాయం పొందారు.

అర్జీల గతి ఇంతేనా!

భయపడుతున్న గిరిజన ప్రజాప్రతినిధులు

గతంలో గిరిజన ప్రాంతంలో నిబంధనలు ఉల్లంఘించి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టినా రాజకీయాలకు అతీతంగా గిరిజనులు ఏకమై ఆందోళన చేసేవారు. ఇపుడు కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు చూసి ఏమి చేస్తారోనన్న భయంతో గిరిజన ప్రజాప్రతినిధులు ముందుకు రావడం లేదు. కళ్ల ముందే కోట్లాది రూపాయల విలువ చేసే ప్రకృతి సంపద తరలించుకుపోతున్నా ఏం చేయలేని పరిస్థితి ఉందని గిరిజన ప్రజాప్రతినిధులు అంటున్నారు. దేనికై నా కాలమే సమాధానం చెబుతుందంటూ మిన్నకుండిపోతున్నారు. వామపక్షాలు, స్థానిక ప్రజాప్రతినిధులు, గిరిజనులు, ఇలా ఎంతమంది ఈ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పీకర్‌ ఇలాకాలో జరుగుతుంది కాబట్టి అధికారులు పట్టించుకోలేదని బహిరంగంగా అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement