
యోగాంధ్రతో మభ్యపెడుతున్న కూటమి ప్రభుత్వం
మునగపాక: యోగాంధ్ర పేరుతో కూటమి ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతోందని ఐద్వా రాష్ట్ర కార్యదర్శి డి.రమాదేవి ఆరోపించారు.మండలంలోని తిమ్మరాజుపేట డావెన్సీ అంతర్జాతీయ పాఠశాలలో రెండవ రోజు జరిగిన మహిళా చైతన్య శిక్షణ శిబిరంలో ఆమె మాట్లాడారు.ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని చెప్పారు.ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే యోగాంధ్ర కార్యక్రమాన్ని తెరపైకి తీసుకువస్తున్నారన్నారు.కడపలో మూడేళ్ల చిన్నారిపై లైంగికదాడి చేసి, హత్య చేస్తే సీఎం చంద్రబాబు,హోంమంత్రి అనిత స్పందించకపోవడం విచారకరమన్నారు.రాష్ట్రంలో మహిళలపైనా, చిన్నారులపైనా ఇటువంటి ఘటనలు అధికంగా జరుగుతున్నా పట్టించుకోకపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఐద్వా రాష్ట్ర కమిటీ సభ్యురాలు ప్రభావతి మాట్లాడుతూ ఎన్నికల హామీలను విస్మరించిన కూటమి ప్రభుత్వానికి నూకలు చెల్లే రోజులు దగ్గరలో ఉన్నాయన్నారు. మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన కూటమికి గుణపాఠం తప్పదని తెలిపారు. హక్కులను కాపాడుకునేందుకు మహిళలు రాజీలేని పోరాటం చేయాలన్నారు.ఐద్వా జిల్లా అధ్యక్షురాలు పి.మాణిక్యం, ప్రధాన కార్యదర్శి డి.డి. వరలక్ష్మి, ఆర్.లక్ష్మి,వాణి, జి.సుభాషిణి, సీహెచ్ మంగతాయారు, సత్యవతి,గౌరీ, సూర్యప్రభ తదితరులు పాల్గొన్నారు.