సమావేశంలో మాట్లాడుతున్న
ఏడీఆర్ ముకుందరావు
అనకాపల్లి: వరి నారుమళ్లు వేసుకోవడానికి తేమ అదును చూసుకుని నేలను దున్నాలని ఏడీఆర్ డాక్టర్ సీహెచ్.ముకుందరావు తెలిపారు. స్థానిక ఆర్ఏఆర్ఎస్ కార్యాలయంలో మంగళవారం శాస్త్రవేత్తలతో సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నారుమడిని ఎత్తుగా వేసుకుని 5 సెంట్ల నారుమడికి 200 కిలోల పశువుల ఎరువు, 2 కిలోల యూరియా, 6 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 2 కిలోల మ్యురేట్ ఆఫ్ పొటాష్ను, ఎకరాకు 20 కిలోల చొప్పున విత్తనం వేసుకోవాలన్నారు. తేమను చూసుకుని మొక్క జొన్న పంటకు నేలను దున్ని, తయారు చేసుకోవాలని చెప్పారు. విత్తే ముందు కత్తెర పురుగును అంచనా వేయడానికి ఎకరానికి 10 లింగాకర్షక బుట్టలను అమర్చాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు వి.గౌరీ, ఎం.విశాలాక్ష్మి, ఎ.శిరీష, వి.చంద్రశేఖర్, పి.వి.పద్మవతి, ఎన్.భారతి, ఎ.అలివేణి తదితరులు పాల్గొన్నారు.


