బుచ్చెయ్యపేట : మండలంలో గల మేజర్ పంచాయతీ వడ్డాది కస్తూర్బా పాఠశాల మేడ మీద నుంచి ఇంటర్ విద్యార్థి ప్రమాదవశాత్తూ జారిపడగా తీవ్రంగా గాయపడింది. వడ్డాదికి చెందిన కాకినాడ నాగమణి కేజీబీవీలో ఇంటర్ చదువుతొంది. మంగళవారం ఉదయం మేడ మీద బట్టలు ఆరబెడుతుండగా కాలుజారి కింద పడిపోయింది. దీంతో ఆమె తలకు తీవ్ర గాయమై రక్తస్రావమై కోమాలోకి వెళ్లిపోయింది. ఆ సమయంలో ప్రిన్సిపాల్ పరిమళ లేకపోవడంతో స్థానిక సిబ్బంది నాగమణి కుటుంబ సభ్యులు 108లో అనకాపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో విశాఖ కేజీహెచ్కు తరలించారు. ఆమె చేతికి తలపైన గాయాలవగా కేజీహెచ్లో చికిత్స పొందుతూ కోలుకుంటుంది. జెడ్పీటీసీ దొండా రాంబాబు, కోఆపరేటివ్ అధ్యక్షుడు దొండా నరేష్, పేరెంట్స్ కమిటీ చైర్మెన్ రామూర్తి తదితరులు విశాఖ కేజీహెచ్లో కోలుకుంటున్న నాగమణిని పరామర్శించి మెరుగైన వైద్య సేవలు అందేలా వైద్య సిబ్బందితో మాట్లాడారు. ఏడాది కాలంగా ఇన్చార్జి ప్రిన్సిపాల్తో కేజీబీవీ నడుస్తుంది. నాలుగు రోజుల కిందట కొత్త ప్రిన్సిపాల్ విధుల్లో చేరిన విద్యార్థులకు స్థానికంగా అందుబాటులో ఉండకపోగా ఆరు నెలలుగా వసతి గృహంలో ఆర్ఓ ప్లాంట్ పనిచేయక తాగునీరు అందకపోగా, సీసీ కెమెరాలు పనిచేయడం లేదని, విద్యార్థుల భోజనాలు సరిగా వండి పెట్టడం లేదని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.


