అనకాపల్లి: పార్లమెంటు ఆమోదించిన మహిళా రిజర్వేషన్ చట్టం అమలును డీలిమిటేషన్తో ముడిపెట్టడం పెద్ద కుట్ర అని, నియోజకవర్గాల పునర్విభజన, జనగణనతో సంబంధం లేకుండా తక్షణమే చట్టసభల్లో మహిళా కోటాను అమలు చేయాలని నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ విమెన్ (ఎన్ఎఫ్ఐడబ్ల్యూ) జిల్లా కార్యదర్శి బూసి పరమేశ్వరి డిమాండ్ చేశారు. స్థానిక కలెక్టరేట్లో ఇన్చార్జ్ డీఆర్వో శ్రీనివాసరావుకు మంగళవారం ఆమె వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బీజేపీ సర్కార్ రాజకీయ లబ్ధి కోసమే మహిళా బిల్లును ఆమోదించిందని, దానిపై ఆ పార్టీకి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. 2023 బిల్లులో మోసపూరిత షరతులు పెట్టి మోదీ ప్రభుత్వం మహిళలను వంచించిందని ఆరోపించారు. ఒకవేళ పార్లమెంటు, శాసనసభ ఎన్నికల్లో తక్షణమే అమలు చేసి ఉంటే.. 2024 ఎన్నికల ద్వారా 180 మంది మహిళలు ఎంపీలుగానూ, పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలుగానూ చట్టసభల్లో ఉండేవారని పేర్కొన్నారు. చట్టానికి జనగణన, డీలిమిటేషన్తో ముడిపెట్టి దాని అమలుకు మోదీ మోకాలడ్డారని దుయ్యబట్టారు. ఎన్ఎఫ్ఐడబ్ల్యూ ఆధ్వర్యంలో పార్లమెంటు సమావేశాల సందర్భంగా ఢిల్లీలో ప్రధాని మోదీని నిలదీస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు కె.లక్ష్మి, రమణమ్మ, రమ్య, సావిత్రి తదితరులు పాల్గొన్నారు.


