దేవరాపల్లి: మండలంలోని రైవాడ జలాశయంలో రెండు నెలల పాటు చేపల వేటపై నిషేధం విధిస్తున్నట్టు స్థానిక మత్స్యశాఖ సహాయకుడు ఎన్. అప్పలనారాయణ తెలిపారు. చేపల పునరుత్పత్తి, మత్స్య సంపద సంరక్షణ లక్ష్యంగా జిల్లా మత్స్యశాఖ అధికార్ల ఆదేశాల మేరకు మంగళవారం స్థానిక వేటదారులతో మంగళవారం ఆయన సమావేశం నిర్వహించారు. ప్రతీ ఏటా మాదిరిగా జూలై ఒకటి నుంచి ఆగస్టు 31 వరకు జలాశయంలో చేపల వేట పూర్తిగా నిషేధించబడుతుందన్నారు. ఈ కాలంలో చేపలు గుడ్లు పెట్టి సహజసిద్ధంగా అభివృద్ధి చెందేందుకు అవకాశం కల్పించడమే నిషేధం ఉద్దేశ్యమని వివరించారు. నిషేధ కాలంలో రైవాడ జలాశయం పరిధిలో వేటదారులు చేపల వేటకు వెళ్లరాదని సూచించారు. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించి వేటసాగించే వారిపై లైసెన్స్ రద్దు చేసి జరిమానా విధిస్తామని హెచ్చరించారు. వేట నిషేధం అమలులో ఉన్న రెండు నెలల కాలానికి ప్రభుత్వం నుంచి జీవన భృతి అందించాలని సమావేశంలో పాల్గొన్న వేటదారులంతా అధికారులను కోరారు.


