విజిలెన్స్ అధికారులు సీజ్ చేసిన 6వ నంబరు చౌక దుకాణం
యలమంచిలి రూరల్: పట్టణంలోని రేషన్ షాపుల్లో సోమవారం రాత్రి విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేశారు.పలు దుకాణాల్లో బియ్యం,పంచదార,ఇతర సరుకుల నిల్వలను పరిశీలించారు. స్థానిక కాకివానివీధిలో 6వ నంబరు చౌకదుకాణంలో 43 క్వింటాళ్ల బియ్యం నిల్వలు అదనంగా గుర్తించారు.అదనపు సరుకు ఎందుకు ఉందని ప్రశ్నించిన అధికారులకు వినియోగదారులు తర్వాత తీసుకెళ్తామని చెప్పి బియ్యం ఇక్కడ ఉంచారని చౌక దుకాణం నిర్వాహకుడు సమాధానమివ్వడంతో విస్తుపోయారు.దుకాణ నిర్వాహకుడిపై 6ఏ కేసు నమోదు చేసిన అధికారులు దుకాణాన్ని సీజ్ చేశారు.అయితే మంగళవారం కూడా ఆ వివరాలు మీడియాకు చెప్పకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది.పట్టుబడిన దుకాణ నిర్వాహకుడు అధికారపార్టీకి చెందిన వ్యక్తి కావడంతో నాయకుల ఒత్తిడివల్లే వివరాలు చెప్పడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఇదిలా ఉండగా విజిలెన్స్ నిఘా నీరుగారిపోవడంతో చౌక దుకాణాల నిర్వాహకులు బియ్యాన్ని అక్రమంగా రైసు మిల్లులకు తరలిస్తున్నారు.తనిఖీలు కేవలం మొక్కుబడేనన్న విమర్శలున్నాయి.


