కలెక్టర్ నిశాంతి
సాక్షి, పాడేరు: ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జరుగుతున్న ఓటర్ల జాబితా సమగ్ర సవరణ(సర్) కార్యక్రమంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ టి.నిశాంతి హెచ్చరించారు. సోమవారం ఆమె అధికారులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో మాట్లాడారు. ఓటర్ల జాబితా సమగ్ర సర్వే కార్యక్రమాన్ని అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని, నూరుశాతం ఓటర్ల డిజిటలైజేషన్ను ఈనెల 10వతేదీ నాటికి పూర్తి చేసే లక్ష్యంతో పనిచేయాలన్నారు. జిల్లా వ్యాప్తంగా నియమితులైన 624 మంది బీఎల్వోలు క్షేత్రస్థాయిలో పర్యటించి నిర్ణీత గడువులోగా ‘సర్’ను పూర్తి చేయాలన్నారు. అరకులోయ నియోజకవర్గంలో 2,48,665 ఓటర్ల ఫారాల పంపిణీ చేయగా,52.92శాతం డిజిటలైజేషన్ పూర్తయిందని, పాడేరు నియోజకవర్గంలో 2,51,083 ఫారాలకు గాను 48.48 శాతం డిజిటలైజేషన్ పూర్తి చేశామన్నారు. ప్రత్యేక అధికారులు, ఏఆర్వోలు, సంబంధిత సిబ్బంది ఓటర్ల సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆదేశించారు.
ఎన్నికల విధులకు హాజరు కావాలి
ఓటర్ల సవరణ కార్యక్రమానికి నియమితులైన అడిషనల్ అసిస్టెంట్ ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు తప్పనిసరిగా ఎన్నికల విధులకు హాజరుకావాలని, లేని పక్షంలో సస్పెన్షన్ తప్పదని కలెక్టర్ హెచ్చరించారు. విధులకు గైర్హాజరైనా, అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహించకపోయినా ఆయా అధికారుల తీరును తీవ్రంగా పరిగణించి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.ఇదే చివరి హెచ్చరిక అని అందరూ విధుల్లో నిమగ్నమవ్వాలని ఆదేశించారు.
270 నంబర్ పోలింగ్ కేంద్రం తనిఖీ
పాడేరు మండలం నడిమివీధిలోని 270 నంబర్ పో లింగ్ కేంద్రాన్ని కలెక్టర్ టి.నిశాంతి ఆకస్మికంగా త నిఖీ చేశారు.గ్రామ సచివాలయంలో ఓటర్ల సవరణ ప్రక్రియను పరిశీలించారు.నిర్ణీత గడువులోగా ఓటర్ల జాబితా సవరణను పూర్తి చేయాలని ఆదేశించారు.
త్వరితగతిన ‘సర్’ పూర్తి: జేసీ
గూడెంకొత్తవీధి: ‘సర్’ ప్రక్రియను వేగవంతం చేయాలని జేసీ తిరుమణి శ్రీపూజ ఆదేశించారు. మండలంలోని బూత్ నంబర్ 23 పరిధిలో ఉన్న డి.అగ్రహారంలో ఆమె సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీఎల్వోలకు అంతా సహకరించాలని కోరారు. అవసరమైన శాఖల సిబ్బంది సాయం తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఎన్యుమరేషన్ ఫారంలను తీసుకున్న వెంటనే నింపి బీఎల్వోలకు ఓటర్లు అందజేయాలని ఓటర్లను కోరారు. అవసరమైన ఫొటోలు,ఆధార్ జెరాక్స్ కాపీలను సిద్ధంగా ఉంచుకోవాలని తెలిపారు.ఈ నెల పదవ తేదీ నాటికి ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పారు.
జిమాడుగుల(పాడేరు రూరల్): సర్ వేగవంతంగా పూర్తి చేయాలని పాడేరు జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ తెలిపారు, సోమవారం జిమాగుల మండలంలో సొలభం,గడుతూరు పంచాయతీల్లో ఆమె విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించినవారిపై శాఖా పరమైన చర్యలు తప్పవన్నారు.


