మునగపాక: భూసేకరణ చేపట్టకుండా సాగునీటి కాలువలు కప్పేయడం సరికాదని సోమవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద నిర్వాసిత రైతులు ఆందోళన చేపట్టారు. సాగునీటి కాలువలు కప్పేసి రిటైనింగ్ వాల్ నిర్మించడం వల్ల సాగునీరు ప్రవహించే పరిస్థితులు ఉండవని, ఈ విషయమై న్యాయం చేయాలని కోరారు. గంగాదేవిపేట నుంచి మునగపాక బ్రిడ్జి వరకు ఉన్న రైతులు ఆందోళనకు దిగి డీటీ మురళీధర్కు వినతి అందజేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ మండల కన్వీనర్, బాధిత రైతు ఆడారి అచ్చియ్యనాయుడు మాట్లాడుతూ పూడిమడక రోడ్డు విస్తరణలో భాగంగా పొలాలు, గృహాలు నష్టపోతున్న రైతులు, బాధితులకు మెరుగైన పరిహారం అందించాలన్నారు. ఆర్ఆండ్బీ, జిరాయితీకి సంబంధించి పక్కాగా సర్వే చేయించాలన్నారు. సీఐటీయూ నాయకుడు ఎస్.బ్రహ్మాజీ మాట్లాడుతూ టీడీఆర్ బాండ్లకు అంగీకరించడం లేదన్నారు. 2013 భూసేకరణ చట్ట ప్రకారం గ్రామసభల హామీలో భాగంగా బాధితులకు మెరుగైన పరిహారం అందించాలన్నారు. ఆడారి సన్యాశిదేవుళ్లు, ఆళ్ల కృష్ణ, దొడ్డి శేషుకుమార్, దొడ్డి జగన్నాథరావు, ఆళ్ల జగ్గారావు, ఆడారి అప్పారావు, కాండ్రేగుల పైడికొండ, వేగి వెంకటప్పారావు, ఆళ్ల సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.


