పెందుర్తి: ఉద్యోగాన్వేషణలో వలస బాట పట్టిన ఓ నిరుద్యోగి ప్రమాదవశాత్తు రైల్లో నుంచి జారిపడిన ఘటన పెందుర్తి సమీపంలో చోటు చేసుకుంది. తీవ్రంగా గాయపడిన అతడ్ని పెందుర్తిలో పోలీసులు తక్షణమే స్పందించి ఆస్పత్రికి తరలించి ప్రాణాపాయం నుంచి బయటపడేలా చేశారు. వివరాలివి.. శ్రీకాకుళం జిల్లా పాతపట్నానికి చెందిన దున్నా తిలక్(35) ఉద్యోగాన్వేషణ నిమిత్తం ఇటీవల విశాఖకు వచ్చాడు. అనంతరం తిరిగి శనివారం అర్ధరాత్రి శ్రీకాకుళానికి వెళ్లే రైల్లో ఇంటికి ప్రయాణమయ్యాడు. ఈ క్రమంలో వేకువజాము 2.30 గంటల సమయంలో పెందుర్తి దాటిన తరువాత రైల్లో నుంచి ప్రమాదవశాత్తు జారిపడ్డాడు. తీవ్ర గాయాలతో ట్రాక్పై అచేతనంగా పడి ఉన్నాడు. నైట్ రౌండ్స్లో ఉన్న సీఐ కె.వి.సతీష్కుమార్కు ప్రమాదంపై సమాచారం అందింది. వెంటనే స్పందించిన ఆయన ఘటనాస్థలికి అంబులెన్స్ రప్పించి గాయపడ్డ తిలక్ను కేజీహెచ్కు తరలించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సీఐ తెలిపారు.


