అనకాపల్లి టౌన్: ఒక్కసారి వర్షం కురిస్తే చాలు తుమ్మపాల ప్రధాన రోడ్డు చెరువులా మారిపోతుంది. అత్యంత ప్రధాన మార్గం కావడం, రోడ్డుకు పక్కన కాలనీలు ఉండడంతో ఈ ప్రాంత వాసులు రాక పోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. ఈ రోడ్డును బాగు చేయాలని నెలలు కాదు సంవత్సరాల నుంచి మొరపెట్టుకుంటున్నా సమస్య పరిష్కారం కాకపోవడంతో ఈ రోడ్డుకు ఆనుకొని ఉన్న లాల్ బహదూర్ శాస్త్రి మార్గ్, తిల్ మార్గ్, మహాత్మా గాంధీ మార్గ్ తదితర కాలనీ వాసులు ఆదివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో కుర్జీలు వేసుకొని రోడ్పై బైఠాయించి తమ నిరసనను తెలిపారు. దీంతో ఆ రహదారిలో ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఈ రహదారి గుండానే చోడవరం, మాడుగుల, పాడేరు తదితర ప్రాంతాల నుంచి ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులు నిత్యం తమ రాకపోకలు సాగిస్తుంటారు. మండలంలో ఉన్న క్వారీల నుంచి అధిక సంఖ్యలో క్వారీ లారీలు వెళుతుంటాయి. దీంతో గోతులు ఆపే వర్షపు నీరు వెరసి ఈ రోడ్పై ప్రాణం అరచేతిలో పెట్టుకొని ప్రయాణించాల్సి వస్తుందని పలువురు వాపోతున్నారు. ప్రతీ ఏడాదీ ఇదే పరిస్థితి అని, తమ పిల్లలను స్కూళ్లకు పంపాలన్నా, అత్యవసరమై ఆసుపత్రికి వెళ్లాలన్నా భయపడాల్సి వస్తుందని, అధికారులు ప్రజా ప్రతినిధులు ఇప్పటికై నా రోడ్డును ఎత్తు చేసి, డ్రైనేజీ నిర్మించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
తుమ్మపాల ప్రధాన రహదారిపై
గ్రామస్తుల బైఠాయింపు


