● ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్పర్సన్జల్లిపల్లి సుభద్ర
● ముంచంగిపుట్టులో ఘనంగాఅల్లూరి విగ్రహావిష్కరణ
ముంచంగిపుట్టు: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు భావితరాలకు స్ఫూర్తిప్రదాత అని విశాఖ ఉమ్మడి జిల్లాల జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర అన్నారు. శనివారం మండల కేంద్రంలోని చెరువు ప్రాంగణంలో అల్లూరి 129వ జయంతి పురస్కరించుకుని, జెడ్పీ చైర్పర్సన్ దంపతులు సుభద్ర, మూర్తి తమ సొంత నిధులతో అల్లూరి విగ్రహన్ని ఏర్పాటుచేశారు. దీనిని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, పాడేరు మాజీ ఎమ్మెల్యే కొట్టగుల్లి భాగ్యలక్ష్మి, జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర ఆవిష్కరించారు. విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అల్లూరి ఆశయాలను సాధిద్దాం అంటూ నినాదాలు చేశారు. ఆ తర్వాత స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో అల్లూరి జయంతిపై ఏర్పాటు చేసిన ప్రత్యేక సభలో ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం మాట్లాడుతూ, స్వాతంత్య్ర సంగ్రామంలో అల్లూరి పోరాటం మరువలేనిదని, గిరిజన ప్రాంతాల్లో ఆంగ్లేయులను ఎదిరించి, ఆదివాసీలకు అండగా నిలవడంలో ఆయన పోషించిన పాత్ర చిరస్మరణీయమని అన్నారు. ప్రజల హక్కు ల పరిరక్షణ, న్యాయం కోసం నిలబడటం వంటి లక్ష్యాలు అందరికీ ఆదర్శనీయమని ఆయ న పేర్కొన్నారు. పాడేరు మాజీ ఎమ్మెల్యే, ఎస్టీ సెల్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు కొట్టగుల్లి భాగ్యలక్ష్మి మాట్లాడుతూ, బ్రిటీష్ వారి దోపిడీకి వ్యతిరేకంగా ప్రాణాలకు తెగించి పోరాడిన గొప్ప యోధుడు అల్లూరి అని కొనియాడారు. ముంచంగిపుట్టులో అల్లూరి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ద్వారా యువతలో చైతన్యాన్ని నింపేందుకు సుభద్ర తీసుకున్న నిర్ణయం అభినందనీయమని ఆమె అన్నారు. జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర మాట్లాడుతూ, అల్లూరి పోరాట పటిమ, ఆత్మస్థైర్యం నేటి యువతకు ఆదర్శంగా నిలవాలని అన్నారు. కేవలం 27 ఏళ్ల వయసులోనే బ్రిటీష్ వారికి వణుకు పుట్టించిన తెలుగు వీరుడని, తెలుగు నేలకు ఆయన ఎంతో గౌరవాన్ని తెచ్చారని పేర్కొన్నారు. అల్లూరి త్యాగాన్ని గుర్తించి, గత ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఈ జిల్లాకు అల్లూరి సీతారామరాజు జిల్లాగా పేరు పెట్టి, ఆయనకు సముచిత గౌరవం ఇచ్చారని గుర్తుచేశారు. విగ్రహాన్ని ఏర్పాటు చేసిన జల్లిపల్లి సుభద్ర, మూర్తి దంపతులను పలువురు నేతలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అరిసెల సీతమ్మ, ఎంపీడీవో ధర్మారావు, ఎంఈవోలు కృష్ణమూర్తి, త్రినాథ్, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షులు పద్మారావు, జేసీఎస్ జిల్లా కోఆర్డినేటర్ జగబంధు, ఎంపీటీసీలు సుబ్బలక్ష్మి, కమల, గణపతి, గిరిజన ఉద్యోగుల సంఘం మండల అధ్యక్షులు బాబురావు, మాజీ సర్పంచ్ నరసింగరావు, అంబేడ్కర్ సాధన సమితి నాయకులు అనిల్, కొండపడాల్, గోవింద్, వైఎస్సార్సీపీ మండల నేతలు రాంప్రసాద్, పాపారావు, అర్జున్, గాసిరావు, దశరథ్, తిరుపతి మరియు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
అలుపెరగని పోరాట యోధుడు అల్లూరి: ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు
స్వాతంత్య్ర సమరయోధుడు, మన్యం విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతిని పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు పాడేరులోని తన క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.గిరిజన హక్కుల పరిరక్షణ,స్వాతంత్య్రం కోసం గిరిజనుల పక్షాన అల్లూరి చేసిన అలుపెరగని పోరాటాలను ఈసందర్భంగా ఎమ్మెల్యే వివరించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు సీదరి రాంబాబు, నాయకులు దశమూర్తి, రాజంనాయుడు, రామ్గోపాల్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.


