● కలెక్టర్ నిశాంతి
● ఘనంగా జయంతి వేడుకలు
సాక్షి,పాడేరు: గిరిజన హక్కుల సాధనతో పాటు స్వాతంత్య్ర పోరాట యోధుడిగా అల్లూరి సీతారామరాజు చరిత్రలో నిలిచారని కలెక్టర్ టి.నిశాంతి అన్నారు. ఆయన జయంతి వేడుకలను శనివారం కలెక్టరేట్లో ఘనంగా నిర్వహించారు.అల్లూరి విగ్రహానికి కలెక్టర్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బ్రిటీష్ సామ్రాజ్యాన్ని ఎదురించి, గిరిజనుల కోసం అలుపెరగని పోరాటాలు చేసిన అల్లూరి పిన్న వయసులోనే ప్రాణాలు అర్పించిన మహోన్నత వీరుడుగా నిలిచారన్నారు.ఈ కార్యక్రమంలో డీఆర్వో లోకేశ్వరరావు, పలుశాఖల అధికారులు పాల్గొన్నారు.
పాడేరు : అల్లూరి జయంతి వేడుకలను శనివారం ఐటీడీఏలో ఘనంగా నిర్వహించారు. ఇక్కడి కాంస్య విగ్రహానికి ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ, సిబ్బంది పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు చూపిన పోరాట పటిమ, దేశభక్తి నేటి తరానికి ఎంతో ఆదర్శమన్నారు. మన్యం ప్రజల హక్కుల కోసం ఆయన చేసిన రంప తిరుగుబాటు ఓ చరిత్ర అన్నారు. దేశ స్వాతంత్య్రంతో పాటు గిరిజనుల హక్కులు కోసం ఆయన చేసిన పోరాటాలు ఎంతో చిరస్మరణీయమన్నారు. కార్యక్రమంలో ఐటీడీఏ ఏవో హేమలత, ట్రైకార్ అసిస్టెంట్ సీతారామయ్య, ఐటీడీఏ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లా పోలీసు కార్యాలయంలో..
పాడేరు: జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. పోలీస్ కార్యాలయ ఆవరణలోని అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహానికి జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) వై.శృతి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, స్వాతంత్య్ర పోరాటంలో అల్లూరి సీతారామరాజు చేసిన త్యాగాలను, ఆయన పోరాట పటిమను కొనియాడారు. నేటి యువత అల్లూరి స్ఫూర్తిని, ఆయన చూపిన ధైర్యసాహసాలను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎన్డీపీఎస్ వింగ్ ఇన్స్పెక్టర్ ఫైడపు నాయుడు, స్పెషల్ బ్రాంచ్, డీసీఆర్బీ, ఐటీ కోర్ ఇన్స్పెక్టర్లు, సబ్–ఇన్స్పెక్టర్లు, హెడ్ కానిస్టేబుళ్లు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


