● ఆదివాసీ జేఏసీ డిమాండ్
కొయ్యూరు: గిరిజన చట్టాలను గౌరవిస్తూ, షెడ్యూల్డ్ ప్రాంతంలో గిరిజనేతరుల భూములకు పట్టాలు ఇచ్చే ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని కోరుతూ శుక్రవారం ఆదివాసీ జేఏసీ నాయకులు తహసీల్దారు కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ఆడాకుల, ఆర్. కొత్తూరు, బాలారం గ్రామాల్లో గిరిజనేతరులకు పట్టాలు ఇచ్చేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారని, ఇది చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో భూ బదలాయింపు చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా అధికారులు గిరిజనేతరులకు పట్టాలు జారీ చేస్తే, భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ మొట్టడం రాజుబాబు, మండల జేఏసీ అధ్యక్షులు ఎస్.అశోక్ లాల్, ఉపాధ్యక్షులు కొర్ర తిరుపతి, నాయకులు శివకుమార్, పాటి శేఖర్, సునీల్, ప్రసాద్ పాల్గొన్నారు.


