అల్లూరి సీతారామరాజు జన్మస్థలమైన పాండ్రంగిలో ఆయన జ్ఞాపకార్థం నిర్మిస్తున్న మ్యూజియం పనులు కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో నిలిచిపోయాయని స్థానికులు, పర్యాటకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రూ.2 కోట్ల అంచనా వ్యయంతో మ్యూజియం నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. భవనాన్ని స్లాబ్ స్థాయి వరకు నిర్మించారు. అనంతరం ప్రభుత్వం మారడంతో పనులు నిలిచిపోయాయి. ప్రస్తుతం స్లాబ్, ఫ్లోరింగ్, తలుపులు, ద్వారబంధాలు, పెయింటింగ్ తదితర పనులు పూర్తి చేయాల్సి ఉన్నప్పటికీ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా వాటిని పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టలేదు. అల్లూరి వంటి మహనీయుడి జ్ఞాపకాలను భావితరాలకు చేరవేసే మ్యూజియం నిర్మాణం పూర్తి కాకపోవడం పట్ల చరిత్రకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే నిధులు విడుదల చేసి మ్యూజియాన్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు.


