కష్టాల
ప్రయాణం
జీవనం
అవస్థల
స్వాతంత్య్రం సిద్ధించి ఎనిమిది దశాబ్దాలు కావస్తోంది. దేశం అంగారక గ్రహం మీదకు దూసుకెళ్తోంది. కానీ, ముంచంగిపుట్టు మండలంలోని గొబ్బరపడ, బుడ్డపనస, డెంగం, జర్రెలపోదర్ గ్రామాల గిరిజనులకు మాత్రం నేటికీ రోడ్డు అన్నది తీరని కలగానే మిగిలిపోయింది. గురువారం ఉదయం... ఆ నాలుగు గ్రామాలకు చెందిన గిరిజనులు తమ నిత్యావసర సరుకుల కోసం, పంచాయతీ పనుల కోసం ఐదు కిలోమీటర్ల కాలిబాటను ఎంచుకున్నారు. చేతిలో సరుకులు, భుజాన బస్తాలతో కొండలు, కోనలు దాటుతూ వారు పడుతున్న అవస్థలు చూస్తుంటే గుండె తరుక్కుపోయింది. ఒక్క గొబ్బరపడ నుంచి జర్రెలపోదర్ వరకు సుమారు 180 కుటుంబాలు, 600 మందికి పైగా ప్రజలు నివసిస్తున్నారు. వీరందరికీ నేటికీ ఆధునిక రవాణా సౌకర్యం అందనంత దూరంలో ఉంది. ఈ ప్రాంత ప్రజల కష్టాలను గుర్తించి ప్రభుత్వం జోడిగుమ్మ నుంచి జర్రెలపోదర్ వరకు రహదారిని మంజూరు చేసింది. కానీ, పనులు మాత్రం నత్తనడకన సాగుతున్నాయి. అటవీశాఖ అనుమతుల పేరుతోనో, అధికారుల నిర్లక్ష్యం వల్లనో ఆ రోడ్డు నిర్మాణం మధ్యలోనే ఆగిపోయింది. ఫలితంగా, గిరిజనుల జీవితాలు మళ్లీ మొదటికే వచ్చాయి. మాకు రవాణా సౌకర్యం కల్పించండి.. మమ్మల్ని మనుషులుగా గుర్తించండి.. అంటూ వారు విన్నవించుకుంటున్నా వినే నాథుడే కరువయ్యాడు. ఇప్పటికై నా మా సమస్యను పట్టించుకోవాలని వారు కోరుతున్నారు. – ముంచంగిపుట్టు


