● సీలేరు అటవీ శాఖ ఆధ్వర్యంలో
పర్యావరణహిత కార్యక్రమం
సీలేరు: అడవులను సంరక్షించడం, అటవీ విస్తీర్ణాన్ని పెంచడం ద్వారానే భవిష్యత్తు తరాలకు మేలు జరుగుతుందని సెక్షన్ ఆఫీసర్ సతీష్ అన్నారు. సీలేరు అటవీ రేంజ్ పరిధిలోని ధారకొండ, దుప్పులవాడ బీట్లలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా గురువారం భారీగా ’విత్తన బంతులను’ (సీడ్ బాల్స్) వెదజల్లారు. ఈ కార్యక్రమంలో భాగంగా దుప్పులవాడ పంచాయతీ దెబ్బకోట గ్రామంలో 4 వేలు, గొందిపోలంలో 2 వేలు, అలాగే అమ్మవారి ధారకొండ బీట్ పరిధిలోని ఏనుగుబైలు ప్రాంతంలో మరో 4 వేలు.. మొత్తం 10 వేల విత్తన బంతులను సెక్షన్ ఆఫీసర్ సతీష్ ఆధ్వర్యంలో వెదజల్లారు. ఈ కార్యక్రమంలో స్థానిక గిరిజన యువతీ యువకులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సతీష్ మాట్లాడుతూ.. అడవులను నాశనం చేయడం వల్ల అనేక అనర్థాలు సంభవిస్తున్నాయి. పర్యావరణ సమతుల్యత కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి. విత్తన బంతులను తయారు చేసి అటవీ ప్రాంతాల్లో జల్లడం ద్వారా అడవులను మరింత పచ్చదనంతో నింపవచ్చు.. అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో దుప్పులవాడ ఏబీవో ప్రకాష్, బీట్ ఆఫీసర్ లోవరాజు, బేస్ క్యాంప్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


